యుద్ధం పర్యవసానం వీరమల్లుపైనే!
ఈ యుద్ధం ఇప్పుడు టాలీవుడ్ లో కొన్ని రిలీజ్ లకు ముప్పు తెచ్చింది.
By: Tupaki Desk | 10 May 2025 9:29 AM ISTదేశంలో పరిస్థితులు సజావుగా ఉన్నప్పుడే ఏదైనా సంపూర్ణంగా సాగుతుంది. అలజడి చెలరేగితే దాని పర్యవసానం వేరుగా ఉంటుంది. ముఖ్యంగా రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చింది అంటే ఆ రెండు దేశాలు దాని పర్యవసానాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. భారీగా ఆర్థిక నష్టం.. మార్కెట్లు కుప్పకూలడం, రవాణాలో కల్లోలం వగైరా పర్యవసానాలు ఉంటాయి. ఇప్పుడు వినోదరంగం కూడా కుప్పకూలే పరిస్థితి తలెత్తుతోంది. ఈ పరిస్థితుల్లో భారతదేశంలో ఏ సినీపరిశ్రమ కూడా పాన్ ఇండియా రిలీజ్ లు చేయలేదు. కనీసం జనాల్ని గుంపుగా థియేటర్లకు రప్పించే పరిస్థితి ఇకపై ఉండదు. ఇప్పటికే భారతప్రభుత్వం, మిలటరీ సందేశాలు చూస్తుంటే, యుద్ధం ఇప్పట్లో ఆగదు. ఇండియా- పాక్ ఒకరిపై ఒకరి ఆధిపత్యం కోసం పోరు మొదలు పెట్టేసారు.
ఈ యుద్ధం ఇప్పుడు టాలీవుడ్ లో కొన్ని రిలీజ్ లకు ముప్పు తెచ్చింది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లుని ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేయాలని భావించిన సమయంలో ఇది ఊహించని ఉపద్రవం ముంచుకొచ్చింది. దేశంలో యుద్ధవాతావరణం నెలకొంది. అసలే వీరమల్లు ఆపసోపాలు పడుతూ తెరకెక్కిన సినిమా. దీనిని పూర్తి చేయడం కోసం నిర్మాత ఏ.ఎం.రత్నం చాలా ఆర్థికపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్నిటినీ మించి రాజకీయ నాయకుడిగా మారిన పవన్ కల్యాణ్ కాల్షీట్ల సమస్యతో పదే పదే షూటింగులు డిలే అవుతూ, చివరికి పనులన్నీ ముగించుకుని విడుదలకు వస్తున్న సమయంలో యుద్ధం వచ్చింది. ఈ సమయంలో మే 30 రిలీజ్ తేదీని లాక్ చేసినా కానీ, ఇప్పటి వార్ డిక్లరేషన్ కన్ఫామ్ కావడంతో నిర్మాతల నెత్తిపై బాంబ్ పడిందని చెబుతున్నారు.
ఇప్పుడున్న సన్నివేశంలో దేశవ్యాప్తంగా భారీగా సినిమాలను విడుదల చేయలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా థియేటర్లు, సమావేశ మందిరాల్లో ప్రజలు గుమిగూడేందుకు పోలీసులు పర్మిషన్ ఇవ్వడ గగనంగా మారుతుంది. ఇప్పటికి అధికారికంగా థియేటర్ల మూత లేదు కానీ, మునుముందు పరిస్థితులు ఎలా మారతాయో ఊహించడం కష్టంగా ఉంది. దీని పర్యవసానం పాన్ ఇండియా కేటగిరీలో విడుదల చేయాలనుకున్న వీరమల్లుపై పడిందని చెబుతున్నారు.
వీరమల్లుతో పాటు విజయ్ దేవరకొండ కింగ్ డమ్ ని కూడా పాన్ ఇండియాలో అత్యంత భారీగా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు నార్త్ లో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. బార్డర్ అంతా భయానక పోరాట దృశ్యాలతో గగుర్పాటుకు గురి చేస్తోంది. భారత ఆర్మీ ధీటుగా స్పందిస్తున్నా ఇది యుద్ధం అనేది ఎవరూ మరువకూడదు. ఇలాంటి సమయంలో సినిమాలను దేశవ్యాప్తంగా భారీగా విడుదల చేసే పరిస్థితి కనిపించడం లేదని విశ్లేషిస్తున్నారు. కారణం ఏదైనా వార్ ముగిసింది అనేంత వరకూ ఈ భారీ చిత్రాలను విడుదల చేసే పరిస్థితి లేదని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం బెల్లంకొండ- నారా రోహిత్- మంచు మనోజ్ నటించిన భైరవం సినిమా పరిమిత బడ్జెట్ తో వస్తోంది గనుక ఈ టీమ్ పరిమిత థియేటర్లలో విడుదలయ్యేందుకు ఛాన్సుంది. అందుకే భైరవంకి లైన్ క్లియరైనట్టేనని కూడా విశ్లేషిస్తున్నారు. పెద్ద సినిమాలు లేనప్పుడు అది చిన్న హీరోలకు కలిసి వస్తుందని అంచనా. వీరమల్లు, కింగ్ డమ్ చిత్రాల వాయిదా నిర్ణయం నిజమే అయితే, నిర్మాతలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంటుంది.