'హనుమాన్' నిర్మాత... బిగ్ మల్టీస్టారర్ ప్లాన్
తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబోలో రూపొంది 2024 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'హనుమాన్' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 16 May 2025 6:05 AMతేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబోలో రూపొంది 2024 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'హనుమాన్' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. హనుమాన్ సినిమాతో నిర్మాత కె.నిరంజన్ రెడ్డి భారీ లాభాలు దక్కించుకున్నాడు. హనుమాన్ ఇచ్చిన జోష్తో వరుస ప్రాజెక్ట్లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు కూడా మొదలు పెట్టాడు. హనుమాన్ తర్వాత రెండు మూడు చిన్న సినిమాలను షురూ చేసిన నిర్మాత కె నిరంజన్ రెడ్డి త్వరలోనే ఒక భారీ మల్టీస్టారర్ సినిమాను పట్టాలెక్కించేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.
అభిరుచి గల నిర్మాతగా నిరంజన్ రెడ్డి పేరు దక్కించుకున్నాడు. ముందు ముందు కూడా వైవిధ్యభరిత కమర్షియల్ సినిమాలను నిర్మించాలని ఆయన భావిస్తున్నాడట. ఆ క్రమంలో భాగంగా ఎన్నో కథలు విన్న నిర్మాత నిరంజన్ రెడ్డి ఎట్టకేలకు ఒక భారీ మల్టీ స్టారర్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం అందుతోంది. టాలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న విఐ ఆనంద్ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి సినిమాను నిర్మించేందుకు గాను రెడీ అవుతున్నాడు. వీరిద్దరి మధ్య ఇప్పటికే రెండు మూడు సార్లు చర్చలు జరిగాయని, కథ విషయంలో ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కూడా జరిగిందనే వార్తలు వస్తున్నాయి.
దర్శకుడు విఐ ఆనంద్ 2014లో హృదయం ఎక్కడున్నది సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా అంతగా ఆడక పోయినా వెంటనే సందీప్ కిషన్తో టైగర్ సినిమాను చేసే అవకాశం దక్కించుకున్నాడు. భారీ అంచనాల నడుమ వచ్చిన టైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. ఆ తర్వాత ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమాను రూపొందించాడు. నిఖిల్ హీరోగా నటించిన ఆ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. సినిమా బాగుందే అంటూ చాలామంది సినిమా గురించి మాట్లాడారు. కథ, కాన్సెప్ట్ విభిన్నంగా ఉండటంతో పాటు థ్రిల్లర్ ఎలిమెంట్స్ను డీసెంట్గా డీల్ చేసిన విధానం బాగుందని అంతా అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆ తర్వాత ఆనంద్ దర్శకత్వంలో ఒక్క క్షణం, డిస్కో రాజా, ఊరు పేరు భైరవ కోన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కమర్షియల్గా బిగ్ సక్సెస్లు దక్కకున్నా దర్శకుడిగా ఆనంద్కి గుర్తింపు లభించింది. అందుకే ఆయన దర్శకత్వంలో నటించేందుకు యంగ్ హీరోలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కనుక మల్టీస్టారర్ సినిమాను ఆనంద్ దర్శకత్వంలో నిర్మించేందుకు గాను నిర్మాత కె.నిరంజన్ రెడ్డి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు హీరోలతో చర్చలు జరిగాయని, క్రేజ్ ఉన్న హీరోలను పట్టుకోవడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. త్వరలోనే ఈ మల్టీస్టారర్కి సంబంధించి పూర్తి వివరాలను దర్శకుడు విఐ ఆనంద్, నిర్మాత కె.నిరంజన్ రెడ్డి లు అధికారికంగా వెళ్లడించే అవకాశాలు ఉన్నాయి.