గోపిచంద్ - 'సాహసం' కాంబినేషన్లో మరొకటి
డిఫరెంట్ కంటెంట్ను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ట్రాక్ లో దూసుకెళ్తున్న శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ మరో కొత్త ప్రాజెక్ట్ను లాంఛనంగా ప్రారంభించింది
By: Tupaki Desk | 24 April 2025 12:46 PMడిఫరెంట్ కంటెంట్ను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ట్రాక్ లో దూసుకెళ్తున్న శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ మరో కొత్త ప్రాజెక్ట్ను లాంఛనంగా ప్రారంభించింది. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ సంస్థ ఓ మాస్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను హ్యాండ్సమ్ హీరో గోపిచంద్తో కలిసి తెరకెక్కించనుంది. గతంలో వీరిద్దరూ కలిసి 'సాహసం' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.
ఇప్పుడు అదే కాంబినేషన్లో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కొత్త చిత్రానికి కుమార్ సాయి అనే యువ దర్శకుడు మెగాఫోన్ పడుతున్నాడు. ఇదే ఆయనకు తొలి సినిమా కావడం విశేషం. అలాగే 'సాహసం' సినిమాకు కెమెరామెన్గా పనిచేసిన షామ్దత్ ఈ సినిమాకు కూడా పనిచేయనుండడం విశేషం. ఈ చిత్రం ప్రారంభోత్సవం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా జరిగింది.
సినిమాను అత్యున్నత నిర్మాణ విలువలతో రూపొందించేందుకు నిర్మాతలు సన్నద్ధమవుతున్నారు. గోపిచంద్ సరసన మలయాళ బ్యూటీ మీనాక్షి దినేశ్ కథానాయికగా నటించనున్నారు. ఆమెకు ఇది తొలి తెలుగు సినిమా కావడం విశేషం. గోపిచంద్ పవర్ఫుల్ యాక్షన్తో పాటు, ఇంటెన్స్ డైలాగ్స్, కథనంలో మిస్టరీ అంశాలు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయని మేకర్స్ తెలిపారు.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా, బాపినీడు ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. కథ, కథనం, సాంకేతిక నిపుణులతో ఈ సినిమా భారీ అంచనాలను క్రియేట్ చేసింది. గోపిచంద్ కెరీర్లో మరో బిగ్ హిట్ గా నిలిచేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే మిగతా నటీనటులు, సాంకేతిక బృంద వివరాలు ప్రకటించనున్నారు.
ప్రస్తుతం గోపిచంద్ ఘాజి దర్శకుడు సంకల్ప్ రెడ్డితో ఒక సినిమా చేస్తున్నాడు. అలాగే రాధేశ్యామ్ దర్శకుడు రాధాకృష్ణతో కూడా ఒక సినిమా చర్చల్లో ఉంది. ఇలా వరుస ప్రాజెక్టులతో గోపిచంద్ మరోసారి మంచి కమర్షియల్ హిట్ కోసం సిద్ధమవుతున్నాడు. ఇక 'సాహసం' కాంబినేషన్లో ఈ కొత్త చిత్రం ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.