Begin typing your search above and press return to search.

220 కోట్ల బ‌డ్జెట్ సినిమా 12కోట్లకే ఢ‌మాల్

గణపత్ భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద ఫ్లాప్ చిత్రాలలో ఒకటిగా నిలిచింద‌ని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషించింది.

By:  Tupaki Desk   |   31 Oct 2023 3:30 AM GMT
220 కోట్ల బ‌డ్జెట్ సినిమా 12కోట్లకే ఢ‌మాల్
X

మ‌హ‌మ్మారీ తర్వాత ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినీప‌రిశ్ర‌మ‌లు వేగంగా పుంజుకున్నాయి. మళ్లీ మెగా బడ్జెట్ చిత్రాల సమయం వచ్చింది. మహమ్మారి స‌మ‌యంలో భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో సందిగ్ధ ప‌రిస్థితి ఎదురైంది. క‌లెక్ష‌న్లు లేక విల‌విల‌లాడారు. కానీ 2022 తర్వాత పెద్ద సినిమాలు ప్రేక్షకులను థియేట‌ర్ల‌కు లాగడం ప్రారంభించడంతో చిత్ర పరిశ్రమ తిరిగి పుంజుకుంది. RRR, KGF చాప్టర్ 2- పఠాన్- జ‌వాన్ లాంటి చిత్రాల అఖండ‌ విజయం పెద్ద చిత్రాల ఘ‌న‌మైన పునరాగమనాన్ని ఆవిష్క‌రించాయి. ఇది అంద‌రు నిర్మాతలను ఉత్సాహపరిచింది. అయితే పరిశ్రమ పదే పదే నిరూపించినట్లుగా, అదే ఫార్ములా అన్ని సమయాలలో పనిచేయదన‌డానికి ఇది ఒక ఘ‌న‌మైన‌ ఉదాహ‌ర‌ణ‌. ఇప్పుడు మెగా-బడ్జెట్ చిత్రం 'గ‌ణ‌ప‌త్' పరాజయం దానిని రుజువు చేసింది. టైగ‌ర్ ష్రాఫ్ న‌టించిన 'గ‌ణ‌ప‌త్' చిత్రం భారతదేశపు అతిపెద్ద ఫ్లాప్ గా నిలిచింద‌ని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషిస్తోంది. ఈ సినిమా నిర్మాణ వ్య‌యంలో 6శాతం మాత్రమే తిరిగి పొందింద‌ని చెబుతున్నారు.

టైగర్ ష్రాఫ్ న‌టించిన భారీ చిత్రం 'గణపత్'పై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ ఫ‌లితం ఊహించ‌ని రీతిలో తిర‌కాసు అయింది. గణపత్ భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద ఫ్లాప్ చిత్రాలలో ఒకటిగా నిలిచింద‌ని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషించింది. ప్ర‌భాస్ న‌టించిన ఆదిపురుష్ ఓపెనింగులు అద్భుతంగా రాబ‌ట్టింది. కానీ భారీ బ‌డ్జెట్..కాస్ట్ ఫెయిల్యూర్ వంటి కార‌ణాల‌తో డిజాస్ట‌రైందని ట్రేడ్ విశ్లేషించింది. కానీ గణపత్ కి ఓపెనింగులు జీరో. నష్టాల శాతం చాలా ఎక్కువ. 200 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం థియేట్రికల్ రన్‌లో కేవలం 12 కోట్ల రూపాయలను మాత్రమే వసూలు చేయగలిగింది. ఓవర్సీస్ కలెక్షన్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అంటే ఈ చిత్రం దాని నిర్మాణ వ్యయంలో 6శాతం మాత్రమే సంపాదించింది. 94 శాతం నష్టాలు ఎదుర‌య్యాయి. దీనర్థం ఈ చిత్రం దాని పెట్టుబడిలో దాదాపు రూ. 188 కోట్లను కోల్పోయింది. ఇటీవలి సంవత్సరాలలో బాలీవుడ్‌లో ఇతర పెద్ద బాక్సాఫీస్ డిజాస్టర్లతో పోలిస్తే గ‌ణ‌ప‌త్ ప‌రాభ‌వం అతి పెద్ద‌ద‌ని విశ్లేషిస్తున్నారు.

మహమ్మారి తర్వాత ఇటీవలి సంవత్సరాలలో బాక్సాఫీస్ వద్ద క్రాష్ అయిన పెద్ద చిత్రం గణపత్ మాత్రమే కాదు. ఇంకా కొన్ని కోట్లకు పైగా నష్టపోయిన వారు కూడా ఉన్నారు. అక్షయ్ కుమార్ సామ్రాట్ పృథ్వీరాజ్ దాదాపు రూ. 140 కోట్లు నష్టపోగా, రణబీర్ కపూర్ నటించిన షంషేరా రూ. 100 కోట్లకు పైగా నష్టపోయింది. అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా నష్టాలు దాదాపు 60 కోట్ల రూపాయలు. కంగనా రనౌత్ చివరి హిందీ విడుదలైన ఢాకడ్ - కూడా ఇంత పెద్ద‌ మొత్తాన్ని కోల్పోయింది. కంగ‌న తాజా చిత్రం తేజస్ కూడా ట్రేడ్ లెక్క‌ల ప్రకారం 25 కోట్ల రూపాయలకు పైగా నష్టపోతుంది.