చనిపోయిన పాప్ ఐకాన్ పై లైంగిక వేధింపుల కేసు!
పాప్ దిగ్గజం మైఖేల్ జాక్సన్ మరణించి దశాబ్ద కాలం అయినా? ఆయన చుట్టూ ఉన్న వివాదాలు మాత్రం అడపాదడపా తెరపైకి వస్తూనే ఉన్నాయి.
By: Srikanth Kontham | 25 April 2026 7:51 PM ISTపాప్ దిగ్గజం మైఖేల్ జాక్సన్ మరణించి దశాబ్ద కాలం అయినా? ఆయన చుట్టూ ఉన్న వివాదాలు మాత్రం అడపాదడపా తెరపైకి వస్తూనే ఉన్నాయి. తాజాగా నలుగురు తోబుట్టువులు (ఒకే కుటుంబానికి చెందిన వారు) పాప్ ఐకాన్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. మైఖేల్ జాక్సన్ తమను మానసికంగా లొంగదీసుకుని సుదీర్ఘ కాలం పాటు వేధింపులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కొత్త ఆరోపణలు చేసిన వారు గతంలో ఎప్పుడూ బహిరంగంగా ముందుకు రాలేదు.
మైఖేల్ జాక్సన్ తమ కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉండేవారని ఆ చొరవను ఆసరాగా చేసుకుని తమపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. భౌతిక దాడులే కాకుండా, ఆ విషయాలను ఎవరికీ చెప్ప కుండా ఉండేలా తమను ఎంతో చాకచక్యంగా మభ్యపెట్టేవారని ఒక రకమైన బ్రెయిన్ వాషింగ్ కు గురిచేశారని ఆరోపించారు. తాజాగా ఈ పరిణామం జాక్సన్ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. బాధితులు పేర్కొన్న వివరాల ప్రకారం ఈ వేధింపులు నెవర్ల్యాండ్ రాంచ్ - జాక్సన్ పర్యటనల సమయంలో జరిగినట్లు చెబుతున్నారు.
తాము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు జాక్సన్ తమకు ఎన్నో ఖరీదైన బహుమతులు ఇచ్చేవారని తద్వారా తమ తల్లిదండ్రుల నమ్మకాన్ని కూడా పొందారని తెలిపారు. ఆ నమ్మకమే తమ పాలిట శాపమైందని ఆయన గదిలో జరిగిన భయంకరమైన అనుభవాలు నేటికీ తమను వెంటాడుతున్నాయని కోర్టుకు సమర్పించిన పత్రాల్లో వివరించారు. అయితే మైఖేల్ జాక్సన్ ఎస్టేట్ ప్రతినిధులు మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
ఇవన్నీ డబ్బు కోసమే చేస్తున్న కుట్రలని మరణించిన వ్యక్తి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడమే వీరి ఉద్దేశమని వాది స్తున్నారు.
గతంలో కూడా ఇలాంటి అనేక కేసులు తెరపైకి వచ్చాయని వాటన్నింటిలోనూ జాక్సన్ నిర్దోషిగా తేలారని గుర్తు చేసారు. అయితే బాధితులు మాత్రం తమకు న్యాయం జరగాలని ప్రపంచానికి నిజం తెలియాలనే ఉద్దేశంతోనే ధైర్యంగా ముందుకొచ్చామని చెబుతున్నారు. సమాజంలో అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తులు ఇలాంటి నేరాలకు పాల్పడినప్పుడు బాధితులు బయటకు రావడానికి దశాబ్దాల సమయం పడుతుందనే వాదన కూడా వినిపిస్తోంది.
అగ్ర తారల వెనుక చీకటి కోణాలను బయటపెట్టడం అంత సులభం కాదని కానీ `మీ టూ` వంటి ఉద్యమాలు ఇచ్చిన ధైర్యంతోనే ఇప్పుడు గళం విప్పుతున్నామని బాధితుల తరపు న్యాయవాదులు పేర్కొంటున్నారు. తాజాగా ఈ కేసు ప్రపంచవ్యాప్త మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. మైఖేల్ జాక్సన్ సంగీత ప్రపంచంలో అజేయమైన శక్తిగా నిలిచారు. కానీ ఇలాంటి ఆరోపణలు పదే పదే రావడం ఆయన వ్యక్తిత్వంపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తోంది. న్యాయస్థానం ఈ ఆరోపణలను ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటుంది? దర్యాప్తులో ఎలాంటి నిజాలు బయటపడతాయి అన్నది ?వేచి చూడాలి.
