Begin typing your search above and press return to search.

దాస‌రి స్మార‌కం వైర‌ల్: ప‌రిశ్ర‌మ పెద్ద దిక్కుకు అవ‌మానం! ఆయ‌న వార‌సులు, శిష్యులు ఎక్క‌డ‌?

ఈరోజు మంచు మ‌నోజ్ అత‌డి శిష్య బృందం ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావు మెమోరియ‌ల్ ని చేరుకోగా అక్క‌డి నుంచి విడుద‌లైన ఊహించ‌ని ఈ వీడియోలను చూడ‌గానే అభిమానులు ఎంతో ఎమోష‌న్ కి గుర‌వుతున్నారు.

By:  Sivaji Kontham   |   30 May 2026 10:51 AM IST
దాస‌రి స్మార‌కం వైర‌ల్: ప‌రిశ్ర‌మ పెద్ద దిక్కుకు అవ‌మానం! ఆయ‌న వార‌సులు, శిష్యులు ఎక్క‌డ‌?
X

ఎప్పుడూ ఒకడికి తలవంచని..చెయ్యి చాచని మహారాజుని అయ్యో పాపం అనుకునేలా చేశారు.. ఆయన సమాధికి ఈ గతి పట్టించారు..ఆస్తులు కోసం కొట్టుకుంటున్న ఇద్దరు కొడుకులు ఎక్కడున్నారు..? ... ఇదీ ఒక నెటిజ‌న్ ఆవేశం.

ఆయ‌న చుట్టూ భాజాలు- భ‌జంత్రీలు మోగించేవారు.. పొగ‌డ్తలు ప‌రిహాసాల‌తో ఇళ్లంతా సంద‌డి చేసేవారు శిష్య‌గ‌ణం. రాజు గారి ఆన లేనిదే త‌మ జీవితం ముందుకు సాగ‌ద‌ని విన‌యం చూపించేవారు.. ఆయ‌న ఇంట్లో నిత్య అన్న‌దానంలో ఆక‌లి తీర్చుకునేవారు.. చివ‌రికి ఆయ‌న ఇచ్చే భ‌త్యం అందుకుని కుటుంబాన్ని పోషించేవారు. కానీ ఇప్పుడు ఆ శిష్య‌గ‌ణం ఏమ‌య్యారు? ... ఇదీ ఆయ‌న మెమోరియ‌ల్ ద‌గ్గ‌ర పిచ్చి తుప్ప‌లు, చెత్త‌ చూసిన నెటిజ‌నుల ఆవేద‌న‌..

ఈరోజు మంచు మ‌నోజ్ అత‌డి శిష్య బృందం ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావు మెమోరియ‌ల్ ని చేరుకోగా అక్క‌డి నుంచి విడుద‌లైన ఊహించ‌ని ఈ వీడియోలను చూడ‌గానే అభిమానులు ఎంతో ఎమోష‌న్ కి గుర‌వుతున్నారు. ఎటు చూసినా పిచ్చి తుప్ప‌లు, ముళ్ల కంప‌లు, పాదులు పాకి అది నిజంగా మెమోరియలేనా? లేక పురాత‌న గుహ‌నా? అనే సందేహాల్ని క‌లిగించింది. ఎన్టీఆర్ మెమోరియ‌ల్ లేదా ఇంకేదైనా సెల‌బ్రిటీ మెమోరియ‌ల్ కి ఇలాంటి దుస్థితి ప‌ట్టిందా? కానీ ద‌ర్శ‌క‌దిగ్గ‌జం దాస‌రి నారాయ‌ణ‌రావు కే ఎందుకిలా? అనే ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

మ‌నోజ్- గీతా ఆర్ట్స్ గొప్ప చొరవ: దాసరి సమాధి వద్ద పారిశుద్ధ్య పనులు

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించిన దర్శకరత్న సమాధి ప్రస్తుతం ఉన్న దుస్థితిపై సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలపై పరిశ్రమ వర్గాలు వెనువెంట‌నే స్పందించాయి. దాసరి నారాయణరావు స్మారక స్థలం (సమాధి) వద్ద పిచ్చి మొక్కలు మొలిచి, చెత్తాచెదారంతో నిండిపోయి ఉన్న దృశ్యాలు చూసి అంద‌రూ చ‌లించిపోయారు. పరిశ్రమకు `పెద్ద దిక్కు`గా నిలిచిన ఒక మహోన్నత వ్యక్తి సమాధి ఇలా నిర్లక్ష్యానికి గురికావడంపై అభిమానులు, సినీ ప్రియులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ సానుకూలంగా స్పందించారు. ఆయన పిలుపు మేరకు మంచు మనోజ్ అభిమానులు, అనుచరులు తక్షణమే సదరు స్మారక స్థలానికి చేరుకున్నారు. సమాధి ప్రాంగణంలో పేరుకుపోయిన చెత్తను తొలగించి, పారిశుద్ధ్య పనులను చకచకా ప్రారంభించారు. పరిశ్రమ కోసం ఎంతో చేసిన ఒక మహనీయుడి స్మృతికి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో మనోజ్ బృందం స్వచ్ఛందంగా ఈ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

మరోవైపు ఈ విషయంపై ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కూడా అంతే వేగంగా స్పందించింది. తమ బృందాన్ని వెంటనే రంగంలోకి దించింది. మంచు మనోజ్ అనుచరులతో కలిసి గీతా ఆర్ట్స్ ప్రతినిధులు కూడా ఈ పునరుద్ధరణ పనుల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఇరు బృందాల సమిష్టి కృషితో స్మారక స్థలం వద్ద పారిశుద్ధ్య ప్రక్రియ మరింత వేగవంతమైంది. ప్రాంగణాన్ని శుభ్రం చేయడంతో పాటు దానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు.

పరిశ్రమ లెజెండరీ దర్శకుడికి జ‌రిగిన అవ‌మానంగా దీనిని చూడాలి. ఆయ‌న వారసుల ఉనికి, శిష్యులం అని చెప్పుకున్న వారి ఉనికి ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌క‌మైంద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. స్మారకం విష‌య‌లో మంచు మనోజ్, గీతా ఆర్ట్స్ సంస్థ చూపిన ఈ చొరవ.. బాధ్యతాయుత ప్రవర్తనపై టాలీవుడ్ వర్గాల నుండి ప్రశంసలు కురుస్తున్నాయి. వీరంతా వివాదాలు లేదా విమర్శల జోలికి వెళ్లకుండా... సమస్యను గుర్తించిన వెంటనే ఆచరణలో చూపించ‌డం పరిశ్రమలో ఒక మంచి సంప్రదాయానికి దారితీస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.