ఫహాద్- జక్కన్న.. ఆ సినిమాలు ఏమైనట్లు?
మాలీవుడ్ ప్రముఖ నటుడు ఫహాద్ ఫాజిల్ కు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 23 April 2025 11:43 AMమాలీవుడ్ ప్రముఖ నటుడు ఫహాద్ ఫాజిల్ కు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ పుష్ప సిరీస్ చిత్రాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. సూపర్ క్రేజ్ కూడా సంపాదించుకున్నారు. పలు మాలీవుడ్ మూవీల టాలీవుడ్ వెర్షన్లతో ఆడియన్స్ ఓ రేంజ్ లో మెప్పించారు.
అయితే ఆయన నటించిన ఆవేశం మూవీ ముందు.. బాహుబలి సిరీస్ చిత్రాల ప్రొడక్షన్ హౌస్ ఆర్కా మీడియా కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఫహాద్ తో ఆక్సీజెన్, డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ పేరుతో రెండు సినిమాలు చేస్తున్నట్లు గత ఏడాది మార్చిలో అనౌన్స్ చేసింది. దర్శకధీరుడు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తారని తెలిపింది.
అంతే కాదు.. రెండు సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ ను విడుదల చేసింది. ఆ తర్వాత పలుమార్లు క్యాస్టింగ్ కాల్ అనౌన్స్మెంట్స్ కూడా ఇచ్చింది. కానీ సినిమాలు ప్రకటించి ఏడాదికిపైగా అవుతుంది. మేకర్స్ ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు. దీంతో ఆ రెండు చిత్రాల గురించి ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది.
అయితే పాన్ ఇండియా లెవెల్ లో రూపొందనున్న ఆ రెండు మూవీస్.. ఇప్పుడు హోల్డ్ లో ఉన్నాయని తెలుస్తోంది. షూటింగ్ ప్రారంభమవ్వడానికి ముందే ఓటీటీ డీల్స్ ను పూర్తి చేయాలని మేకర్స్ భావించారట. కానీ అనుకున్న స్థాయిలో డీల్స్ సెట్ అవ్వడం లేదని సమాచారం. అదే సమయంలో ఫహాద్ తన సినిమాల షెడ్యూల్స్ తో బిజీగా ఉన్నారు.
దీంతో ఆ రెండు ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని సమాచారం. ముఖ్యంగా ఆర్కా మీడియా ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేకపోవడం గమనార్హం. అసలు ఆ సినిమాల సంగతేంటని కొందరు నెటిజన్లు క్వశ్చన్ చేస్తున్నారు. ఏం జరుగుతోందని అంటున్నారు. హోల్డ్ లో వెళ్లడానికి ఓటీటీ డీల్సే కారణమా అని కామెంట్లు పెడుతున్నారు.
ఇక ఆ రెండు సినిమాల విషయానికొస్తే.. ఆక్సీజెన్ మూవీకి సిద్దార్థ్ నాదెళ్ల, డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాకు శశాంక్ యేలేటి దర్శకులుగా వ్యవహరిస్తున్నట్లు ఆర్కా మీడియా తెలిపింది. రెండు సినిమాలకు గాను కాల భైరవ సంగీతం అందిస్తున్నట్లు చెప్పింది. మంచి కంటెంట్ తోనే తీస్తారని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. మరి ఆ రెండు చిత్రాలు ఏమవుతాయో వేచి చూడాలి.