NTR Neel మూవీ సంక్రాంతి అప్డేట్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను మొదట 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు ప్రకటన చేశారు.
By: Ramesh Palla | 19 Jan 2026 1:11 PM ISTయంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను మొదట 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు ప్రకటన చేశారు. సినిమాను ప్రారంభించిన సమయంలో వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తామని దర్శకుడు ప్రశాంత్ నీల్ చాలా బలంగా ప్రకటన చేయడం జరిగింది. పోస్టర్స్ పై సంక్రాంతికి విడుదల అని కూడా చెప్పారు. కానీ సినిమా మేకింగ్ విషయంలో చాలా ఆలస్యం అవుతూ వచ్చింది. పైగా ఎన్టీఆర్ లుక్ విషయంలో, ప్రశాంత్ నీల్ యాక్షన్ సీక్వెన్స్ విషయంలో ఆలస్యం జరుగుతూ వచ్చింది. అందుకే సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న విషయం తెల్సిందే. 2026 సంక్రాంతికి విడుదల చేయాలని భావించిన ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ల డ్రాగన్ సినిమా సంక్రాంతి పూర్తి అయినా షూటింగ్ పూర్తి చేసుకోలేదు. ఇంకా మెజార్టీ యాక్షన్ సీన్స్తో పాటు, కీలక సన్నివేశాల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉన్నట్లు చెబుతున్నారు.
ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్ అప్డేట్
డ్రాగన్ సినిమా షూటింగ్ ను మరో రెండు నెలల్లో పూర్తి చేసే విధంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశాడు అంటూ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నుంచి సమాచారం అందుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్తో కీలక సన్నివేశాల చిత్రీకరణ చేపట్టారు. గత నెలలో ఒక షెడ్యూల్ నిర్వహించి కీలక సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది. ఇప్పుడు ఒక భారీ యాక్షన్ సీన్ కోసం సెట్ నిర్మాణం జరుగుతున్నట్లు తెలుస్తోంది. సలార్ సినిమాలో ఉండే భారీ సెట్ మాదిరిగానే డ్రాగన్ యాక్షన్ సీన్ కోసం ప్రశాంత్ నీల్ కాస్త ఎక్కువ ఖర్చు చేయించి ఈ సెట్ ను వేయిస్తున్నాడు అంటూ యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. ఈ భారీ సెట్ నిర్మాణం పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్ పై యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఓల్డ్ లుక్ లో ఒక పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ పాత్రకు సంబంధించిన యాక్షన్ సీన్ ను ఈ సెట్ లో షూట్ చేయబోతున్నారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్
సాధారణంగానే ప్రశాంత్ నీల్ సినిమాలు యాక్షన్ ప్రధానంగా సాగుతాయి. ఇక యాక్షన్ సీన్స్ ను అద్భుతంగా చేసే ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ యాక్షన్ చేస్తే ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా కోసం ఏడాది కాలంగా వెయిట్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ లు మంచి స్నేహితులు అనే విషయం తెల్సిందే. ఎన్టీఆర్ తో ఉన్న సన్నిహిత్యం కారణంగా ప్రశాంత్ నీల్ కాంబో మూవీ చేయాలని ఎన్నో నిర్ణయించుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. సలార్ కంటే ముందు ఎన్టీఆర్ తో చేయాల్సి ఉన్నా అప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో ఉన్న కారనంగా ప్రశాంత్ నీల్ మరో సినిమాను చేశాడని అంటారు. ఇప్పటికి వీరిద్దరి కాంబో సెట్ కావడం, షూటింగ్ ప్రారంభం కావడంతో అభిమానులు, యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారు ఎప్పుడెప్పుడా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కాంబో..
మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా ఉండటం విశేషం. ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ భారీగా ఖర్చు చేయిస్తున్నాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ కెరీర్లోనే ఇది ఒక పెద్ద బడ్జెట్ సినిమాగా నిలవడం ఖాయం అని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్గా రుక్మిణి వసంత్ నటిస్తోంది. రవి బస్రూర్ అందిస్తున్న సంగీతం చాలా ప్రత్యేకంగా ఉంటుంది అంటున్నారు. 2026 సమ్మర్ కి సినిమాను విడుదల చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ నుంచి క్లారిటీ రావడం లేదు. నిర్మాతలు సైతం సమ్మర్ కి ప్లాన్ చేస్తున్నారని, కానీ మేకింగ్ విషయంలో ఆలస్యం అవుతున్న కారణంగా ఈ ఏడాది చివరి వరకు సినిమా విడుదల కోసం వెయిట్ చేయాల్సి రావచ్చు అని సమాచారం అందుతోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
