Begin typing your search above and press return to search.

ప్రొడ్యూసర్ అవతారమెత్తిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్!

ఈ క్రమంలో ఇప్పుడు ప్రొడ్యూసర్ గా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు.

By:  Tupaki Desk   |   4 April 2024 8:03 AM GMT
ప్రొడ్యూసర్ అవతారమెత్తిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్!
X

టాలీవుడ్ లో కామెడీ ఎంటర్టైనర్స్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ త్రినాథరావు నక్కిన. 'ప్రియతమా నీవచట కుశలమా' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన ఆయన.. 'సినిమా చూపిస్తా మావా' 'నేను లోకల్' 'హలో గురు ప్రేమ కోసమే' వంటి మంచి విజయాలు అందుకున్నారు. 'ధమాకా' చిత్రంతో 100 కోట్ల డైరెక్టర్ అనిపించుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ప్రొడ్యూసర్ గా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు.


'నక్కిన నేరేటివ్స్‌' అనే బ్యానర్ స్థాపించి, చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతున్నారు దర్శకుడు త్రినాథ రావు. తన ప్రొడక్షన్ లో ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ కొడుకు విక్రమ్‌ సహిదేవ్‌ హీరోగా ఓ సినిమాని ప్రకటించారు. ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన కథ అందిస్తూ, దర్శకత్వ బాధ్యతలను వంశీకృష్ణ మళ్ల అనే మరో డైరెక్టర్ కు అప్పగించారు. నిన్న బుధవారం హైదరాబాద్‌లో ఈ ప్రాజెక్ట్ ను పూజా కార్యక్రమాలతో లాంచ్ చేసారు. దీనికి హీరో సందీప్‌ కిషన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

త్రినాథరావు నిర్మిస్తున్న సినిమాలో విక్రమ్‌ సహిదేవ్‌ సరసన 'దృశ్యం' ఫేమ్ ఎస్తర్‌ అనిల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. తారక్‌ పొన్నప్పను కీలక పాత్ర కోసం తీసుకున్నారు. 'ఈగల్' మ్యూజిక్ డైరెక్టర్ దేవ్ జాంద్ సంగీతం సమకూర్చనున్నారు. ఇదొక కల్ట్ లవ్ స్టొరీ అని, టౌన్ లో జరిగే అందమైన ప్రేమకథ అని చిత్ర బృందం తెలిపింది. ఎవరూ ఊహించని జానర్‌ చిత్రం అవుతుందని, త్వరలోనే టైటిల్ ను అనౌన్స్ చేస్తామని చెప్పారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది.

'సినిమా చూపిస్తా మామ' వరకూ సొంత కథలు రాసుకున్న త్రినాథరావు నక్కిన.. ఆ తర్వాత బెజవాడ ప్రసన్న కుమార్ రాసిన కథలను తెర మీదకు తీసుకొస్తూ వచ్చారు. మళ్లీ ఇన్నాళ్లకు స్వయంగా స్టోరీ రాసుకొని, తన నిర్మాణంలోనే సినిమాగా తీయడానికి సిద్ధమయ్యారు. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాను కాబట్టి, తనలాగా స్ట్రగుల్ అయ్యేవారికి తన శక్తి మేర అవకాశాలు కల్పించడానికే 'నక్కిన నేరేటివ్స్‌' నిర్మాణ సంస్థని స్థాపించినట్లు త్రినాథరావు చెప్పారు. దీనికి తన ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపారు. దర్శకుడిగా ఆదరించిన ప్రేక్షకులు, ఇప్పుడు నిర్మాతగానూ పెద్దపీట వెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.

ఇకపోతే ‘ధమాకా’తో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్న త్రినాధ రావు నక్కిన.. రెండేళ్ల గ్యాప్ తీసుకొని ఇటీవలే సందీప్ కిషన్ తో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఇది సందీప్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ 30వ చిత్రం. 'ఊరి పేరు భైరవకోన' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత, ఏకే ఎంటర్టైన్మెంట్స్ & హాస్య మూవీస్ నిర్మాణంలో చేస్తున్న చిత్రమిది. SK30 మూవీకి ప్రసన్న కుమార్ కథ, స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. మరోవైపు త్రినాథరావు తన సొంత కథతో నిర్మాతగా మారుతున్నారు. మరి ప్రొడ్యూసర్ గా ధమాకా దర్శకుడు ఎలాంటి సక్సెస్ సాధిస్తారో చూడాలి.