మెట్గాలాలో 21,000 కోట్ల ఖరీదైన నెక్లెస్ మిస్సింగ్?
షారూఖ్, ప్రియాంక చోప్రా, కియరా అద్వాణీ సహా పలువురు స్టార్లు రెడ్ కార్పెట్ ఈవెంట్లో అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్ తో కట్టి పడేసారు.
By: Tupaki Desk | 6 May 2025 10:24 PM ISTమెట్ గాలా 2025 ఈవెంట్లో భారతీయ సెలబ్రిటీలు దుమ్ము దులిపేస్తున్నారు. వేదికపై భారతీయతను ఆవిష్కరిస్తూనే, తమదైన ఫ్యాషన్ సెన్స్ తో అందరి దృష్టిని తమవైపు తిప్పేసుకుంటున్నారు. షారూఖ్, ప్రియాంక చోప్రా, కియరా అద్వాణీ సహా పలువురు స్టార్లు రెడ్ కార్పెట్ ఈవెంట్లో అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్ తో కట్టి పడేసారు.
ఇక గాయకుడు, నటుడు దిల్జీత్ దోసాంజ్ ఇతరుల కంటే నాలుగు ఆకులు ఎక్కువే తిన్నాడు. ముఖ్యంగా మెట్ గాలా ఈవెంట్ కోసం అతడు ఎంపిక చేసుకున్న రాజా వారి లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. అతడు పాటియాలా మహారాజాలా కనిపించాలని కలలు కన్నట్టే కనిపిస్తోంది.
దిల్జిత్ రాయల్ సిక్కు దుస్తుల డిజైన్లతో ప్రేరణ పొందిన కస్టమ్ ఐవరీ దుస్తుల్లో కనిపించాడు - పొడవైన కుర్తా .. తెహ్మత్, గురుముఖి లిపితో చెక్కిన ఎంబ్రాయిడరీ కేప్తో ఆకట్టుకుంది. తనదైన మార్క్ సిగ్నేచర్ తలపాగా .. సాంప్రదాయ కత్తి తో దిల్జీత్ రారాజును తలపించాడు. ఈ రూపం పూర్తిగా ఈవెంట్ కు భారతీయతను ఆపాదించింది.
అంతేకాదు.. దిల్జిత్ దోసాంజ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెక్లెస్ను మెట్ గాలా ఈవెంట్ లో ధరించాలని కోరుకున్నాడు కానీ కార్టియర్ అందుకు అవకాశం కల్పించలేదు. నెక్లెస్ ని అద్దెకు ఇచ్చేందుకు కార్టియర్ సిద్ధంగా లేకపోవడం నిరాశపరిచింది.
1928లో పాటియాలా మహారాజా భూపిందర్ సింగ్ కు నగల పిచ్చి, ఆకర్షణ అంతా ఇంతా కాదు. ఆయన వద్ద కార్టియర్ ఒరిజినల్ నెక్లెస్ ఉండేది. ఆ నెక్లెస్ మధ్యలో దాదాపు 3,000 వజ్రాలను పొదిగి డిజైన్ చేయడమే గాక, 234 క్యారెట్ల భారీ డి బీర్స్ పసుపు వజ్రం మధ్యలో ఉండేది. ఆ రోజుల్లోనే దాని ధర దాదాపు రూ.10 కోట్లు. కానీ నేడు దాని అంచనా విలువ 21000 కోట్లు ( ఇది సుమారు 2.5 బిలియన్ డాలర్లకు సమానం). అయితే కార్టియర్ హారాన్ని ధరించాలన్న దిల్జీత్ కోరిక నెరవేరక పోయినా అది ఎక్కడ ఉంది? అన్న ఆరాలు మొదలయ్యాయి. కార్టియర్ హారంలోని వజ్రాల్ని ముక్కలుగా చేసి అప్పట్లో వేలం వేసారు. అందులోంచి ఏదో ఒక ముక్కను మాత్రమే ఇప్పటికీ ప్రదర్శిస్తున్నారు.
