Begin typing your search above and press return to search.

దేవిశ్రీ Vs థమన్: ఇద్దరిలో పైచేయి ఎవరిది?

టాలీవుడ్ లో ఎంతమంది మ్యూజిక్ కంపోజర్స్ ఉన్నా దేవీశ్రీ ప్రసాద్, ఎస్ థమన్ ల మధ్యనే ప్రధాన పోటీ ఉన్నట్లుగా సినీ అభిమానులు భావిస్తుంటారు.

By:  Tupaki Desk   |   15 March 2024 5:27 AM GMT
దేవిశ్రీ Vs థమన్: ఇద్దరిలో పైచేయి ఎవరిది?
X

టాలీవుడ్ లో ఎంతమంది మ్యూజిక్ కంపోజర్స్ ఉన్నా దేవీశ్రీ ప్రసాద్, ఎస్ థమన్ ల మధ్యనే ప్రధాన పోటీ ఉన్నట్లుగా సినీ అభిమానులు భావిస్తుంటారు. వీరిద్దరూ గత కొన్నేళ్లుగా పోటీపోటీగా తమ సంగీతంతో సంగీత ప్రియులను అలరిస్తున్నారు. మాస్, క్లాస్ అని తేడా లేకుండా అన్ని రకాల సాంగ్స్ కంపోజ్ చేస్తూ, టాప్ ప్లేస్ లో కొనసాగుతూ వచ్చారు. అద్భుతమైన పాటలే కాదు, అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఇస్తారనే పేరు తెచ్చుకున్నారు. అయితే తమన్ హవా మొదలైన తర్వాత డీఎస్పీ క్రేజ్ బాగా తగ్గిపోయిందని, రేసులో కాస్త వెనకబడిపోయారనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి.

2023లో దేవిశ్రీ ప్రసాద్ 'వాల్తేరు వీరయ్య' సినిమాకి మాత్రమే సంగీతం సమకూర్చారు. అదే సమయంలో థమన్ మాత్రం వారసుడు, వీర సింహా రెడ్డి, బ్రో, స్కంద, భగవంత్ కేసరి, అన్నపూర్ణీ వంటి అర డజను ఆల్బమ్స్ తో ఆడియన్స్ ను పలకరించారు. దేవిశ్రీపై పూర్తి డామినేషన్ చూపించారు. అయితే 'పుష్ప: ది రైజ్' చిత్రానికిగానూ బెస్ట్ మ్యూజిక్ కంపోజర్ గా నేషనల్ ఫిలిం అవార్డ్ అందుకున్న తర్వాత డీఎస్పీ పేరు మళ్లీ మారుమోగిపోయింది. క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నీ ఆయన చెంతకు చేరడంతో ఎప్పటిలాగే ఫుల్ బిజీగా మారిపోయారు.

దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప: ది రూల్' వంటి పాన్ ఇండియా చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. నాగచైతన్య, చందు మొండేటి కాంబోలో తెరకెక్కుతున్న 'తండేల్' సినిమాకు వర్క్ చేస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, ధనుష్ లు హీరోలుగా నటిస్తున్న 'కుబేర' మూవీకి సంగీతం సమకూరుస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా కూడా దేవి లైనప్ లో ఉంది.

కోలీవుడ్ హీరో సూర్య, డైరెక్టర్ శివ కాంబోలో రానున్న 'కంగువ' అనే భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకి DSP సంగీతం అందిస్తున్నారు. దీంతో పాటుగా విశాల్ హీరోగా నటిస్తున్న 'రత్నం' చిత్రానికి పని చేస్తున్నారు. ఇలా అర డజను చిత్రాలతో బిజీగా ఉన్న దేవిశ్రీ ప్రసాద్ ఖాతాలోకి ఇప్పుడు లేటెస్టుగా మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చి చేరింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో అజిత్ కుమార్ హీరోగా నటించే 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిని ఎంపిక చేసుకున్నారు.

మరోవైపు థమన్ కూడా ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా గడుపుతున్నారు. పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న OG మూవీకి సంగీతం సమకూరుస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న 'గేమ్ చేంజర్' చిత్రానికి వర్క్ చేస్తున్నారు. ప్రభాస్, మారుతి కలిసి చేస్తున్న 'రాజా సాబ్' సినిమా తమన్ దగ్గరే ఉంది. అలానే 'తేరి' హిందీ రీమేక్ గా రాబోతున్న 'బేబీ జాన్' చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 'డీజే టిల్లు' సీక్వెల్ గా రానున్న 'టిల్లు స్క్వేర్' సినిమాకి బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేస్తున్నారు. లేటెస్ట్ గా నందమూరి బాలకృష్ణ, బాబీ కాంబోలో తెరకెక్కుతున్న 'NBK 109' సినిమా కూడా తమన్ చేతికే వచ్చింది.

ఇలా దేవిశ్రీ, థమన్ ఇద్దరూ బ్లాక్ బస్టర్ లైనప్ తో, ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీగా ఉన్నారు. పనైపోయింది అనుకున్న దేవి మళ్లీ ఫార్మ్ లోకి వచ్చారు. వీరి సినిమాల్లో చాలా వరకు ఈ ఏడాదే రిలీజ్ కాబోతున్నాయి. మరి ఇద్దరు సంగీత దర్శకులలో ఈసారి ఎక్కువ విజయాలు సాధించి ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తారో వేచి చూడాలి.