ఆ మెగా అదృష్టం నాకే దక్కింది : శేఖర్ మాస్టర్
అలాంటిది చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు కలిసి చేసిన పాటలకు కొరియోగ్రఫీ అందించే అవకాశం రావడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను.
By: Tupaki Desk | 27 April 2025 2:30 PMటాలీవుడ్లో మెగా హీరోల సినిమాల్లో నటించినా, ఆ ఫ్యామిలీ హీరోల సినిమాలకు టెక్నీషియన్గా వర్క్ చేసినా మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్స్తో సినిమాల్లో నటిస్తే ఆ హీరోయిన్ ఇండస్ట్రీలో టాప్ స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరి పోవడం ఖాయం. అంతే కాకుండా ఈ హీరోల సినిమాలకు వర్క్ చేస్తే కెరీర్లో తిరుగు ఉండదు అనే టాక్ ఉంది. అలాంటిది చిరంజీవి, రామ్ చరణ్తో మళ్లీ మళ్లీ వర్క్ చేసే అవకాశం దక్కితే అతడు ఎంత అదృష్టవంతుడో అర్థం చేసుకోవచ్చు. అంతే కాకుండా చిరంజీవి-రామ్ చరణ్లు కలిసి చేసిన డాన్స్కు కొరియోగ్రఫీ అందించడం ఎంత అదృష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
చిరంజీవి, రామ్ చరణ్ మొదటి సారి మగధీర సినిమాలో పాటలో కనిపించారు. ఆ పాటలో చిరంజీవి ఓల్డ్ వీడియోను గ్రాఫిక్స్తో కంపోజ్ చేసి రామ్ చరణ్, చిరంజీవి కలిసి డాన్స్ చేసేలా చూపించారు. ఆ తర్వాత ఖైదీ నెం. 150 సినిమాలో రామ్ చరణ్ గెస్ట్గా వచ్చాడు, ఆ తర్వాత ఆచార్య సినిమాలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా నటించడంతో వీరిద్దరి కాంబోలో పాట ఉంది. మొత్తానికి ఈ రెండు సార్లు వారిద్దరూ కలిసి కాలు కదిపారు. రెండు సార్లు కూడా చిరంజీవి-రామ్ చరణ్లు కలిసి చేసిన పాటకు కొరియోగ్రఫీని శేఖర్ మాస్టర్ అందించడం విశేషం. తాజాగా ఆ విషయాన్ని గురించి శేఖర్ మాస్టర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అదృష్టంగా పేర్కొన్నాడు.
సాధారణంగా చిరంజీవి గారికి కొరియోగ్రఫీ చేయడం అంటేనే చాలా పెద్ద విషయం. అలాంటిది చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు కలిసి చేసిన పాటలకు కొరియోగ్రఫీ అందించే అవకాశం రావడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ కొరియోగ్రాఫర్కి దక్కని అదృష్టం నాకే దక్కింది. ఇద్దరినీ కలిపి డాన్స్ చేయించే అవకాశం నాకు దక్కడం, అదీ రెండు సార్లు నాకే దక్కడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను అన్నాడు. ఖైదీ నెం.150 లో అమ్మడు లెట్స్ డు కుమ్ముడు పాటతో నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆచార్య సినిమాలోని బంజారా సాంగ్కి సైతం నేనే కొరియోగ్రఫీ అందించాను. ఇద్దరితో ఒకేసారి డాన్స్ చేయించడం అనేది ఎప్పటికీ మరచిపోలేని విషయం అన్నాడు.
రామ్ చరణ్, చిరంజీవి మళ్లీ ఎప్పుడు కలిసి నటిస్తారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. వీరిద్దరు కలిసి పూర్తి స్థాయిలో నటించిన చిత్రం 'ఆచార్య'. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచింది. అందుకే కొత్త సినిమా వీరిద్దరి కాంబోలో ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాను, దసరా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. మరో వైపు రామ్ చరణ్ 'పెద్ది' సినిమాలో నటిస్తున్నాడు. పెద్ది సినిమాకు ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పట్లో మెగా కాంబో మూవీ లేనట్లే. అయితే కనీసం పాట అయినా మరోసారి ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.