చిరూకి డైలాగ్స్ లేని సీన్ కోసం అంత కష్టపడ్డారా?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా చూడాలని ఉంది.
By: Tupaki Desk | 10 April 2025 10:30 PMమెగాస్టార్ చిరంజీవి హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా చూడాలని ఉంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ నిర్మించిన ఆ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ మూవీలో చిరూకి జోడీగా అంజలా ఝవేరితో పాటూ సౌందర్య కూడా నటించింది. 1998 ఆగస్ట్ 27న రిలీజైన ఆ మూవీలో ప్రకాష్ రాజ్ విలన్ గా నటించారు.
ఆ మూవీలో చిరూ, అంజలా ఝవేరి మధ్య వచ్చే రైల్వే స్టేషన్ లవ్ సీన్ ఇప్పటికీ చాలా స్పెషల్ గా ఉంటుంది. వారిద్దరి మధ్య డైలాగ్స్ లేకుండా కేవలం హావభావాలతో ఈ సీన్ ను తీసి అందరినీ అలరించారు గుణశేఖర్. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆ సీన్ వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు డైరెక్టర్ గుణశేఖర్.
రైల్వేస్టేషన్ లోని ఆ స్పెషల్ సీన్ సుమారు పది నిమిషాల పాటూ ఉంటుంది. ఆ సీన్ లో చిరంజీవికి అసలు డైలాగ్సే ఉండవు. స్టేషన్ లో ఓ చైర్ లో కూర్చుని చిరూ అమ్మాయిని చూస్తూ ఉంటాడు. చిరూకి డైలాగ్ లేకుండా ఓ నిమిషం సన్నివేశం తీయడమే మాటలు కాదు, అలాంటిది ఏకంగా పది నిమిషాల సీన్ ను తీశామని గుణశేఖర్ చెప్పుకొచ్చారు.
అయితే ఆ సీన్ తీయడానికి నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు కావాలని నిర్మాత అశ్వినీదత్ ను అడగ్గానే ఆయన షాకయ్యారని, ఆ రోజుల్లో నాంపల్లి స్టేషన్ చాలా పెద్దదని, ఎన్నో రైళ్లు వస్తూ పోతూంటాయని, మూడు రోజులు చిరంజీవిని పెట్టి అక్కడ షూటింగ్ చేస్తే వచ్చే పోయే ప్రయాణికులకు ఇబ్బంది కలిగి చాలా కష్టమవుతుందని ఆయన భావించారన్నారు.
పైగా చిరంజీవితో షూటింగ్ అంటే రైల్వేశాఖ కూడా పర్మిషన్ ఇవ్వదు. చిరంజీవి లాంటి పెద్ద హీరోతో షూటింగ్ జరుగుతుంటే జర్నీ చేసే ప్రయాణికులకు ఇబ్బంది కలగడంతో పాటూ ట్రైన్స్ ఆగిపోయి వాటి టైమ్స్ మారతాయని, ఆఖరికి ఎంతో కష్టం మీద పర్మిషన్ వచ్చిందని, ఆ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎంతోమంది ట్రైన్స్ ఎక్కకుండా స్టేషన్లోనే ఆగిపోయారని గుణశేఖర్ వెల్లడించారు.