Begin typing your search above and press return to search.

ఐబొమ్మ ర‌విని ఎన్‌కౌంట‌ర్ చేయాల‌ని నిర్మాత ఆవేశం

పైరసీని అరికట్టడంలో కీలక పాత్ర పోషించిన ప్రభుత్వానికి, పోలీసులకు థాంక్యూ చెబుతూ ఏర్పాటు చేసిన మీడియా సమక్షంలో నిర్మాత సి.క‌ళ్యాణ్ మాట్లాడుతూ.. ఐబొమ్మ ర‌విని ఎన్ కౌంట‌ర్ చేయాల‌ని ఆవేశంగా మాట్లాడారు.

By:  Sivaji Kontham   |   18 Nov 2025 8:09 PM IST
ఐబొమ్మ ర‌విని ఎన్‌కౌంట‌ర్ చేయాల‌ని నిర్మాత ఆవేశం
X

పైరసీని అరికట్టడంలో కీలక పాత్ర పోషించిన ప్రభుత్వానికి, పోలీసులకు థాంక్యూ చెబుతూ ఏర్పాటు చేసిన మీడియా సమక్షంలో నిర్మాత సి.క‌ళ్యాణ్ మాట్లాడుతూ.. ఐబొమ్మ ర‌విని ఎన్ కౌంట‌ర్ చేయాల‌ని ఆవేశంగా మాట్లాడారు. ప‌రిశ్ర‌మ‌కు జ‌రుగుతున్న న‌ష్టం చూసి, క‌డుపు మంట‌తో ఇలా మాట్లాడుతున్నాన‌ని ఆయ‌న అన్నారు.

సి కళ్యాణ్ మాట్లాడుతూ... ``మ‌న పోలీసుల‌తో పాటు, విదేశీ పోలీసులు కూడా పైర‌సీ రాకెట్ ని ప‌ట్టుకునేందుకు సాయం చేశారు. దేశం మొత్తంలో తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే పైరసీ సెల్ మెయింటైన్ చేస్తుంది. చాలా కష్టపడి ఐబొమ్మ రవిను పట్టుకున్నారు. దానికి సపోర్ట్ చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ ప్రభుత్వం కలిసి సినీ పరిశ్రమకు అండగా నిలబడాలి. సోషల్ మీడియా ద్వారా పైరసీ వల్ల జరిగే నష్టాన్ని ప్రేక్షకులకు మరింత అర్థం అయ్యేలా చేయాలి. పైరసీ చేసేవారిని కఠినంగా శిక్షించాలి. త్వరలో ప్రభుత్వం నుండి అండగా నిలబడి సాయం చేసిన వారిని సత్కరిస్తాం`` అన్నారు.

చదలవాడ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ.. ``సినిమా టికెట్ ధరలు ఎక్కువ ఉండటం వల్ల ప్రేక్షకులు సినిమాలను పైరసీలో చూస్తున్నారని అంటున్నారు. కాని ఈ పరిస్థితి వల్ల మిగతా చిన్న సినిమాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. అలాగే సినిమా క్యూబ్, యుఎఫ్ఓ వెళుతున్న సంగతి అర్థమవుతుంది. వారి సర్వర్లు బలంగా ఉండేలా చూసుకోవాలి. ఇకపై వారి దగ్గర నుండి సినిమాలు బ‌య‌ట‌కు వెళితే కచ్చితంగా వారే దానికి బాధ్యత తీసుకోవాలి`` అని అన్నారు.

వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ... ``సినిమాలు ప్రస్తుతం విజయం సాధించలేకపోవడానికి ముఖ్య కారణం పైరసీ. టెక్నాలజీ మారుతూ వచ్చిన ప్రతిసారి పైరసీ కూడా రూపం మార్చుకుంటూ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం పైరసీని అరికట్టడం చాలెంజింగ్‌గా తీసుకుని పైరసీ చేసేవారిని పట్టుకున్నారు. కుటుంబంతో సహా థియేట‌ర్ల‌కు వచ్చే విధంగా టికెట్ ధరలు ఉండేలా చూడాలి. పైరసీని పూర్తిగా అరికడితేనే కొత్త నిర్మాతలు ధైర్యంగా ముందుకు వచ్చి సినిమాలు చేస్తారు`` అన్నారు. కార్య‌క్ర‌మంలో ప్ర‌స‌న్న‌కుమార్, బాపిరాజు, వీర‌శంక‌ర్, రాంబాబు తదిత‌రులు పాల్గొన్నారు.