నేను వచ్చేశా... భయ్యా సన్నీ యాదవ్!
కానీ సన్నీ యాదవ్ను విడిచి పెట్టిన నేపథ్యంలో పాకిస్తాన్ ఉగ్రవాదులకు గూఢచర్యం చేశాడు అనేది అవాస్తవం అని, అతడిని ఎన్ఐఏ నిర్ధోషిగా వదిలి పెట్టి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
By: Tupaki Desk | 18 Jun 2025 12:49 PM ISTసోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి భయ్యా సన్నీ యాదవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ట్రావెల్ వ్లాగర్గా, సోషల్ మీడియా సెలబ్రిటీగా సన్నీ యాదవ్కి యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో 1.2 మిలియన్ల ఫాలోవర్స్ను కలిగి ఉన్న భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ టూర్ వివాదాస్పదం అయింది. ఉగ్ర దాడులకు కొన్ని వారాల ముందు సన్నీ యాదవ్ పాకిస్తాన్ వెళ్లడంతో పాటు అతడు మాట్లాడిన మాటల కారణంగా అనుమానం వ్యక్తం అయింది. పలువురు యూట్యూబర్స్ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. అదే క్రమంలో భయ్యా సన్నీ యాదవ్ను సైతం ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.
గత నెలలో సన్నీ యాదవ్ పాకిస్తాన్ వెళ్లి దుబాయ్ మీదుగా చెన్నై వచ్చిన సమయంలో ఎయిర్ పోర్ట్లో దిగిన వెంటనే ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అతడి కుటుంబ సభ్యులు సైతం ఈ విషయమై ఆందోళన వ్యక్తం చేశారు. తమ కొడుకు కనిపించడం లేదని, అతడి సమాచారం చెప్పాలంటూ కోర్ట్ను సైతం ఆశ్రయించారు. కొన్ని వారాల సుదీర్ఘ అనుమానాలు, పుకార్ల తర్వాత భయ్యా సన్నీ యాదవ్ సింహాచలంలో కనిపించాడు. హైదరాబాద్ నుంచి వైజాగ్ చేరుకున్నట్లు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు, ఆ తర్వాత తాను తిరిగి వచ్చాను అంటూ కూడా పోస్ట్లో పేర్కొనడం ద్వారా భయ్యా సన్నీ యాదవ్ విచారణ పూర్తి అయిందని క్లారిటీ వచ్చింది.
విచారణలో ఎన్ఐఏ వారికి ఏమాత్రం అనుమానం కలిగినా, ఏమాత్రం సందేహాత్మకంగా విషయాలు చెప్పినా కూడా కచ్చితంగా అతడిని అరెస్ట్ చేయడంతో పాటు, ఇంకా తమ ఆధీనంలోనే ఉంచుకునే వారు. కానీ సన్నీ యాదవ్ను విడిచి పెట్టిన నేపథ్యంలో పాకిస్తాన్ ఉగ్రవాదులకు గూఢచర్యం చేశాడు అనేది అవాస్తవం అని, అతడిని ఎన్ఐఏ నిర్ధోషిగా వదిలి పెట్టి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకు ఆ విషయం గురించి సన్నీ యాదవ్ నోరు విప్పలేదు. కొన్ని వారాల తర్వాత సోషల్ మీడియాలో కనిపించిన కారణంగా అతడు ఇప్పుడు మళ్లీ తన జర్నీని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడని, పాకిస్తాన్ కి సంబంధించిన ట్రిప్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు అన్నట్లుగానే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఉగ్రవాదులతో కనెక్షన్ ఉందంటూ వచ్చిన వార్తలు పుకార్లే అంటూ సన్నీ యాదవ్ నుంచి ఏమైనా ప్రకటన వస్తుందా అనేది చూడాలి.సన్నీ యాదవ్ అరెస్ట్ అంటూ వార్తలు వచ్చినప్పటి నుంచి అన్వేష్ తీవ్ర స్థాయిలో పోస్ట్లు పెట్టాడు. సన్నీ యాదవ్ కి పాకిస్తాన్ ఉగ్రవాదులతో లింక్ ఉందని దృవీకరిస్తూ మరీ అన్వేష్ వ్యాఖ్యలు చేశాడు. అంతకు ముందు బెట్టింగ్ యాప్స్ విషయంలోనూ సన్నీ యాదవ్, అన్వేష్ మద్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఇద్దరు బూతులు తిట్టుకుంటూ ఒకరి గురించి ఒకరు వీడియోలు చేస్తున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చూడాలి.
