అభిమానుల ప్రేమ వల్లే ఈ రికార్డులు: ఎన్బీకే
నటసింహా నందమూరి బాలకృష్ణ సినీ పరిశ్రమలో నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో ఆయన పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కింది.
By: Sivaji Kontham | 30 Aug 2025 10:36 PM ISTనటసింహా నందమూరి బాలకృష్ణ సినీ పరిశ్రమలో నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో ఆయన పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఈ అరుదైన గౌరవానికి ఎంపికైన తొలి హీరో బాలకృష్ణ.
శనివారం (ఆగస్ట్ 30) నాడు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో .. తెలంగాణ రాష్ట్రంలో వరదలకు అతలాకుతలం అయిన ప్రాంతాల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి యాభై లక్షల ఆర్థిక విరాళాన్ని బాలయ్య ప్రకటించారు.
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ-``నా గురువు, నా దైవం విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, కళా ప్రపూర్ణ, నట రత్న, పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు, నా తల్లి బసవతారకం గారికి ధన్యవాదాలు. నేను ఇండస్ట్రీలో 50 ఏళ్ల సుదీర్ఘమైన ప్రయాణాన్ని పూర్తి చేశాను. నాకు ఈ లెక్కలన్నీ సరిగ్గా గుర్తుండవు. అంకెలన్నీ కూడా అభిమానులు గుర్తు పెట్టుకుంటారు. నా మనవళ్లు కూడా నన్ను బాలా అని పిలుస్తుంటారు. నటుడిగా మా నాన్న గారే నాకు స్పూర్తి. రాజకీయాల్లోకి రాక ముందే ప్రజా సేవా చేసేవారు. వరదల సమయంలో ముందుండి సాయం చేసేవారు. ప్రాంతాలు వేరైనా సరే విపత్కర పరిస్థితుల్లో ఆయన సేవా కార్యక్రమాలు చేశారు. అందరి సహాయ సహకారాలతో క్యాన్సర్ హాస్పిటల్ను నడిపిస్తున్నాను.
సినిమా అనేది బలమైన మాధ్యమం. నా దర్శక, నిర్మాతల సహకారంతోనే ఈ స్థాయికి వచ్చాను. కళకి ఎప్పుడూ భాషా బేధం, లింగ బేధం ఉండదు. మన తెలుగు సినిమా ఇప్పుడు ఆస్కార్ స్థాయికి ఎదిగింది. ఇది మన తెలుగు వారంతా గర్వించదగ్గ విషయం. ఈ రోజు నాకు ఇలా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. నేను 13 ఏళ్ల వయసులోనే తాతమ్మ కల మూవీ చేశాను. గత ఐదు దశాబ్దాల్లో నేను ఎన్నో జానర్లలో, ఎన్నెన్నో పాత్రల్ని పోషించాను. ఆదిత్య 369 అనేది ఇండియాలో మొట్ట మొదటి సైఫై చిత్రం. 50 ఏళ్లలో 110 చిత్రాలు చేశాను.
నేను చిత్ర సీమకు చేసిన సేవకు గానూ ఈ గుర్తింపు దక్కడం ఆనందంగా ఉంది. నేను మూడు సార్లు హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సేవలందిస్తున్నాను. ఇవన్నీ నేను ఒక్కడినే సాధించలేదు. ఈ ప్రయాణంలో నా దర్శక, నిర్మాతలు, కుటుంబ సభ్యులు, అభిమానులు అండగా నిలిచారు. నా భార్య వసుంధర ఈ ప్రయాణంలో నా వెన్నంటే నిల్చుని కుటుంబాన్ని చూసుకున్నారు. కేంద్రం నుంచి రీసెంట్గా పద్మ భూషణ్ అవార్డు లభించింది. భగవంత్ కేసరికి ఉత్తమ జాతీయ తెలుగు చిత్రంగా అవార్డు వచ్చింది. నేను చేసిన అన్ స్టాపబుల్ షో అరుదైన రికార్డులు సాధించింది. నాకు ఈ గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. నాకు విషెస్ అందించిన అమితాబ్ గారికి, రజినీకాంత్ గారికి ధన్యవాదాలు. అభిమానుల ప్రేమ వల్లే ఈ విజయాల్ని, రికార్డుల్ని సాధించాను. ఇదే ఉత్సాహం, ప్యాషన్తో మున్ముందుకు సాగుతానని మాటిస్తున్నాను. ఈ జర్నీ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది`` అని అన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ కు, ఏపీ ఐటీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ , సహజ నటి జయసుధ , వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ సీఈఓ సంతోష్ శుక్లా, జాయింట్ సెక్రటరీ ఓలా తదితరులకు బాలయ్య ధన్యవాదాలు తెలిపారు.
