రెండు కాదు.. ఒక్కటిగా 'బాహుబలి' రీ రిలీజ్
టాలీవుడ్లో ఈ మధ్య రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 4 Jun 2025 5:33 PM ISTటాలీవుడ్లో ఈ మధ్య రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. పెద్ద హీరోల సినిమాలు మొదలుకుని చిన్న హీరోల సినిమాల వరకు ఏదో ఒక సందర్భంలో రీ రిలీజ్కు రెడీ అవుతున్నాయి. కేవలం హిట్ సినిమాలు మాత్రమే కాకుండా ఫ్లాప్ సినిమాలను కూడా రీ రిలీజ్ చేస్తున్న రోజులు ఇవి. ఇలాంటి రోజుల్లో బాహుబలి రీ రిలీజ్ అయితే ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మేకర్స్ బాహుబలి రీ రిలీజ్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. అయితే బాహుబలి రెండు పార్ట్లను కలిపి ఒక్క పార్ట్గా రీ రిలీజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
జక్కన్న రాజమౌళి బాహుబలి సినిమాను మొదట సింగిల్ పార్ట్గానే రూపొందించాలి అనుకున్న విషయం తెల్సిందే. కానీ కథ, బడ్జెట్, మార్కెట్ ఇలా కొన్ని పరిస్థితుల కారణంగా సినిమాను రెండు పార్ట్లుగా తీయాల్సి వచ్చింది. రెండు పార్ట్లు కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. బాహుబలి 1 బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.650 కోట్ల వసూళ్లు సాధిస్తే, బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేసి రూ.1810 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. రెండు సినిమాలు కలిపి ఏకంగా రూ.2460 కోట్లు రాబట్టాయి. రెండు పార్ట్ల్లో కథను డివైడ్ చేసిన విధానం బాగుంది. అందుకే రెండో పార్ట్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది అని అనడంలో సందేహం లేదు.
ఇతర హీరోల సినిమాల మాదిరిగా, ఇతర దర్శకుల సినిమాల మాదిరిగా బాహుబలి రీ రిలీజ్ అయితే ప్రత్యేకత ఏం ఉంటుంది. బాహుబలి సినిమాను చాలా స్పెషల్గా రీ రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ సింగిల్ పార్ట్గా రీ రిలీజ్ చేయాలి అనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రెండు పార్ట్ల్లోని కీలక సన్నివేశాలను తీసుకుని, కథ ఏమాత్రం డిస్ట్రబ్ కాకుండా సినిమాను సింగిల్ పార్ట్గా రీ ఎడిట్ చేసే పనిలో టీం ఉన్నట్లు తెలుస్తోంది. బాహుబలి సింగిల్ పార్ట్లో కనుక వస్తే కచ్చితంగా థియేటర్ల వద్ద మరో వారం రోజుల పాటు హౌస్ ఫుల్ బోర్డ్ కనిపిస్తుంది అంటూ సినీ విశ్లేషకులు, బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బాహుబలి సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేశాడు. అనుష్క, తమన్నా హీరోయిన్లుగా నటించారు. రాజమౌళి ఒక సరికొత్త ప్రపంచంను ఆవిష్కరించినట్లు సినిమాను రూపొందించారు. అద్భుతమైన మేకింగ్ కారణంగా సినిమా అత్యధిక వసూళ్లు సాధించింది. రెండో పార్ట్లో కన్నీళ్లు పెట్టించే సన్నివేశాలతో పాటు, అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. అందుకే ఈ సినిమాను సింగిల్ పార్ట్గా తీసుకు వస్తే కొత్త సినిమాకు వచ్చిన స్థాయిలో రెస్పాన్స్ దక్కే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాహుబలిని రెండు పార్ట్లుగా కాకుండా సింగిల్ పార్ట్గా ఈ ఏడాది అక్టోబర్లో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాను ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ సంయుక్తంగా భారీ బడ్జెట్తో నిర్మించారు.
