Begin typing your search above and press return to search.

'ధృవ' టైప్‌లో అరవింద్ స్వామి మైండ్ గేమ్?

త‌న‌దైన వైవిధ్యమైన నటనతో హీరోగా, విలన్‌గా మెప్పిస్తున్న అరవింద్ స్వామి.. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

By:  Sivaji Kontham   |   25 April 2026 9:39 AM IST
ధృవ టైప్‌లో అరవింద్ స్వామి మైండ్ గేమ్?
X

త‌న‌దైన వైవిధ్యమైన నటనతో హీరోగా, విలన్‌గా మెప్పిస్తున్న అరవింద్ స్వామి.. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గతంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన `ధృవ` చిత్రంలో తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఆయన పోషించిన సిద్ధార్థ్ అభిమన్యు పాత్ర ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. రోజా, బొంబాయి వంటి క్లాసిక్ చిత్రాలతోనే కాకుండా.. ఇటీవల విడుదలైన నవాబ్, కస్టడీ వంటి సినిమాలతో తన రేంజ్ వేరే అని నిరూపించారు.

ప్రస్తుతం టాలీవుడ్ వెర్సటైల్ స్టార్ శర్వానంద్ హీరోగా.. సీనియర్ దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ప్రాజెక్టులో అరవింద్ స్వామి ఒక కీలక పాత్రకు ఎంపికయ్యారు. ఈ వార్త బయటకు రాగానే సినీ వర్గాలు స‌హా ప్రేక్షకుల్లోనూ ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది. మైత్రీ మూవీ మేకర్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అరవింద్ స్వామి పాత్ర ఎలా ఉండబోతుందనే దానిపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఆయన మరోసారి విలన్‌గా కనిపిస్తారా? లేక ఏదైనా ప‌వ‌ర్ ఫుల్ పాత్రలో కనిపిస్తారా అన్నది సస్పెన్స్‌గా మారింది.

దర్శకుడు శ్రీనువైట్ల అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆయన మార్క్ వినోదం. అయితే శర్వానంద్ వంటి నటుడిని ఆయన ఏ జానర్‌లో చూపించబోతున్నారనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా.. శ్రీనువైట్ల స్టైల్ యాక్షన్ - డ్రామా మేళవింపుతో ఉంటుందని తెలుస్తోంది. ఇందులో శర్వానంద్ సరసన `8 వసంతాలు` ఫేమ్ అనంతిక హీరోయిన్‌గా నటిస్తోంది. మరో విశేషమేమిటంటే.. ఈ చిత్రంలో అరవింద్ స్వామితో పాటు మరో సీనియర్ హీరో కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

అర‌వింద స్వామి 2025లో అంత‌గా యాక్టివ్ గా ఉన్న‌ట్టు క‌నిపించ‌లేదు. చాలా వ‌ర‌కూ స్క్రిప్టులు చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయ‌ని క‌థ‌నాలొచ్చాయి. ఆయ‌న కు 2026వ సంవత్సరం కెరీర్ పరంగా చాలా బిజీగా సాగనుంది. శర్వానంద్ చిత్రంతో పాటు ఆయన మరికొన్ని భారీ ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ముఖ్యంగా తమిళంలో ప‌లువురు యువ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషించ‌నున్నార‌ని స‌మాచారం. అలాగే డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్ పై కూడా ఆయన ఆసక్తి కనబరుస్తున్నారు.

చ‌ర‌ణ్ తో ధృవ.. చైత‌న్య‌తో క‌స్ట‌డీ తర్వాత తెలుగులో సరైన ప్రాజెక్ట్ కోసం వేచి చూసిన అరవింద్ స్వామికి.. శర్వానంద్ సినిమా ఒక పర్ఫెక్ట్ ఎంపిక గా భావిస్తున్నారు. అయితే ద‌ర్శకుడు వైట్ల‌ స్వామి స్క్రీన్ ప్రెజెన్స్ ని ఏ విధంగా తీర్చిదిద్దార‌న్న‌ది వేచి చూడాలి. ధృవ‌లో క‌థానాయ‌కుడితో మైండ్ గేమ్ ఆడే మేధావిగా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో క‌నిపించాడు. ఇప్పుడు మ‌రోసారి ఆ రేంజు ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అరవింద్ స్వామి వంటి నటుడు ఒక ప్రాజెక్ట్‌లోకి వచ్చారంటేనే ఆ స్క్రిప్ట్ లో బలం ఉంటుందని ప్రేక్షకులు నమ్ముతారు. కాబట్టి ఈ క్రేజీ కాంబినేషన్ వెండితెరపై ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.