Begin typing your search above and press return to search.

కట్టలు తెంచుకున్న అభిమానుల ఆగ్రహం.. ఇంత‌కీ ఏం చేశారో తెలుసా?

By:  Tupaki Desk   |   11 March 2021 11:30 PM GMT
కట్టలు తెంచుకున్న అభిమానుల ఆగ్రహం.. ఇంత‌కీ ఏం చేశారో తెలుసా?
X
ఫ్యాన్స్ కు ఆనందం వ‌చ్చినా త‌ట్టుకోలేరు.. ఆవేశం వ‌చ్చినా ఆపుకోలేరు! వాళ్ల‌ను సంతోష పెట్టే ప‌నిచేస్తే నెత్తిన పెట్టుకుంటారు.. కోపం వ‌చ్చే ప‌నిచేస్తే నేల‌కేసి కొడ‌తారు.. ఇప్పుడు త‌మిళ్‌ స్టార్ హీరో అభిమానులకు మండింది. ఎవ‌రి మీద చూపెట్టాలో.. ఎలా చూపెట్టాలో తెలియ‌క‌.. ఫాఫం పిచ్చుక మీద బ్ర‌హ్మాస్త్రం సంధించారు. పీర్వోను నిల‌బెట్టి క‌సితీర్చుకున్నారు.

ఇంత‌కీ విష‌యం ఏమంటే.. కోలీవుడ్ లో ర‌జ‌నీ కాంత్‌, విజ‌య్ త‌ర్వాత భారీగా ఫాలోయింగ్ ఉన్న‌ న‌టుల్లో అజిత్ ఒక‌రు. త‌న‌దైన యాక్టింగ్‌, మేన‌రిజం, హెయిర్ స్టైల్ వంటి ప్ర‌త్యేక‌త‌ల‌తో స్పెష‌ల్ హీరోగా నిల‌బ‌డ్డారు థ‌లా. ఆయ‌న స్టామినా ఎలాంటిదో.. గ‌త చిత్రాలే నిద‌ర్శ‌నం. వంద కోట్ల‌కు త‌గ్గ‌కుండా ఆయ‌న సినిమాలు క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించాయి.

అయితే.. అజిత్ అప్ క‌మింగ్ మూవీ ‘వాలిమై’. గతేడాది కరోనా ముందే కొబ్బరికాయ కొట్టిన ఈ సినిమా.. లాక్ డౌన్ నాటికే దాదాపు సగం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత షూట్ మొదలు పెట్టి శరవేగంగా కొనసాగిస్తున్నారు. ఆ మధ్య హైదరాబాద్ లో కూడా ఓ షెడ్యూల్ ఫినిష్ చేశారు. ఇలా.. షూటింగ్ కొనసాగిస్తున్నారు గానీ.. సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్ కూడా ఇవ్వట్లేదు. కనీసం ఓ ఫస్ట్ లుక్కో.. టైటిల్ లోగోనో ఏదీ వదలట్లేదు.

ఏడాదికి పైగా ఎదురు చూస్తున్నా.. స్పందించట్లేదని ఫ్యాన్స్ కు చిర్రెత్తుకొచ్చింది. గతంలో ఓ సారి నిర్మాత బోనీ కపూర్ న సోషల్ మీడియా వేదికగా పట్టుబట్టారు. దీంతో.. త్వరలోనే వస్తుందని చెప్పి తప్పించుకున్నారు. కానీ.. ఇప్పటి వరకూ ఏమీ రాలేదు. ఇక, ఆవేశం పట్టలేక ‘వాలిమై’ చిత్ర పీర్వోను ఏకిపారేశారు.

ఎలా సంపాదించారో తెలియ‌దుగానీ.. అత‌ని పేరు సంపాదించి #worstprosharathchandra అనే హ్యాష్ ట్యాగ్ ను ట్విట్ట‌ర్ లో వ‌దిలారు. ఇది చూసిన అభిమానులంతా ఈ హ్యాష్ ట్యాగ్ ను నేష‌న‌ల్ లెవల్లో ట్రెండ్ చేశారు. వేలాది ట్వీట్లు చేశారు. మొత్తానికి.. అభిమానుల కోప‌మంతా ఇలా పీర్వో మీదుగా వెళ్లిపోయింది. మ‌రి, ఇక‌నైనా చిత్ర యూనిట్ స్పందిస్తుదో లేదో చూడాలి.