Begin typing your search above and press return to search.

‘సీసీసీ’ లో అసలేం జరుగుతోంది..?

By:  Tupaki Desk   |   25 Jun 2020 5:30 PM GMT
‘సీసీసీ’ లో అసలేం జరుగుతోంది..?
X
మహమ్మారి వైరస్‌ కారణంగా దాదాపు రెండున్నర నెలలు షూటింగ్స్‌ జరగలేదు. ఆ సమయంలో సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సినిమా రంగానికి చెందిన అన్ని క్రాప్ట్స్‌ కు చెందిన కార్మికులను గుర్తించి సాయం చేసే ఉద్దేశ్యంతో సినీ ప్రముఖులు కొందరు ముందుకు వచ్చి సీసీసీ ఏర్పాటు చేశారు. ఆ ఛారిటీకి చిరంజీవి నాయకత్వం వహించారు. చిరంజీవి నాగార్జునలు భారీ విరాళం ఇవ్వడంతో పాటు ఆ ఛారిటీ కార్యక్రమాలు పర్యవేక్షించారు.

ఈ ఛారిటీ బాధ్యతలు నిర్వర్తించడం సాయం కావాల్సిన కార్మికులను గుర్తించి సాయం చేసేందుకు ఏడుగురి సభ్యుల బృందంను ఏర్పాటు చేశారు. మొదటి దశలో దాదాపు అందరు సినీ కార్మికులకు సాయంను అందించారు. షూటింగ్స్‌ ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాని కారణంగా ఇప్పటికి కొందరు సినీ కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారని రెండవ దఫా సాయంకు సిద్దం అయ్యారు. అయితే ఈసారి సగం మందికి మాత్రమే సాయం అందించనున్నామని.. నిజమైన అర్హులను గుర్తించాలంటూ ఆయా సంఘాలకు సూచించడం జరిగింది.

సగం మందికి సాయం అందించడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుదవారం నాడు ఇందిరానగర్‌ లోని సీసీసీ ఆఫీస్‌ ను ముట్టడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. విషయాన్ని చిరంజీవి వద్దకు తీసుకు వెళ్లి పరిష్కరించాలని భావిస్తున్నారు. ఈ విషయంలో ఇండస్ట్రీ పరువు పోకుండా సామరస్యంగా పరిష్కరించాలని అంతా కోరుతున్నారు.
Tags: