Begin typing your search above and press return to search.

బిగ్ బి స్ఫూర్తితో మ‌హేష్ ఎగ్జిట్ అవుతారా?

By:  Tupaki Desk   |   12 Oct 2021 11:18 AM IST
బిగ్ బి స్ఫూర్తితో మ‌హేష్ ఎగ్జిట్ అవుతారా?
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ పొగాకు బ్రాండ్ `పాన్ బ‌హార్` కి ప్ర‌చార క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ తో పాటు బాలీవుడ్ న‌టుడు టైగ‌ర్ ష్రాఫ్ `పాన్ బ‌హార్` ప్ర‌క‌ట‌న‌లో క‌నిపిస్తున్నారు. అయితే ఇది కేన్స‌ర్ కు దారి తీసే మ‌త్తు ప‌దార్ధం కావ‌డంతో ఇలాంటి యాడ్ లో మ‌హేష్ న‌టించ‌డం స‌రికాద‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా చాలాసార్లు విమ‌ర్శ‌లు ఎదుర‌య్యాయి. అయినా మ‌హేష్ వాటిని ప‌ట్టించుకోకుండా ఈ డీల్ ని కొన‌సాగిస్తున్నారు. తాజాగా ఈ వివాదం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. ఇటీవ‌లే బిగ్ బీ అమితాబ‌చ్చ‌న్ పాన్ మ‌సాలా బ్రాండ్ `క‌మ‌లా ప‌సంద్` తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ర‌ద్దు చేసుకున్నారు.

ఈ నేప‌థ్యంలో మ‌హేష్ `పాన్ బ‌హార్` ప్ర‌మోష‌న్ మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. స‌ర్రోగేట్ అడ్వ‌ర్టైజింగ్ కింద‌కు వ‌స్తుంద‌ని అమితాబ్ క‌మ‌లా పసంద్ ఒప్పందాన్ని ర‌ద్దు చేసుకున్నారు. అదే విధంగా మ‌హేష్ ప్ర‌మోట్ చేస్తోన్న‌ `పాన్ బ‌హార్` మౌత్ ప్రెష‌ర్ ప్ర‌క‌ట‌న కూడా స‌ర్రోగేట్ అడ్వ‌ర్టైజింగ్ కింద‌కు వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో మ‌హేష్ ఎందుకు ర‌ద్దు చేసుకోలేదు? అన్న వాద‌న తెరపైకి వ‌చ్చింది. కేవ‌లం అమితాబ్ ఒక్క‌రే కాదు గ‌తంలో హాలీవుడ్ స్టార్ పియ‌ర్ బ్రాస్న‌న్ కూడా మ‌హేష్ కంటే ముందు `పాన్ బ‌హార్` ప్ర‌కట‌న‌ని ప్ర‌మోట్ చేసారు. పియ‌ర్ బ్రాస్న‌న్ కూడా స‌ర్రోగేట్ అడ్వ‌ర్టైజింగ్ కింద‌కు రావ‌డంతోనే ఆ ప్ర‌క‌ట‌న నుంచి త‌ప్పుకున్నారు.

పొగాకు బ్రాండ్ ని ప్ర‌మోట్ చేయ‌డం వ‌ల్ల యువ‌త‌కు ఎంతో న‌ష్టం జ‌రుగుతుంద‌ని.. పొగాకు వ్య‌తిరేక చ‌ట్టం నిబంధ‌న‌లు అనుస‌రించి అమితాబ్... బ్రాస్న‌న్ ఈ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. పాన్ బ‌హార్ కంపెనీ హాలీవుడ్ స్టార్ ని మోసం చేసి ప్ర‌క‌ట‌న‌కు ఒప్పించిన‌ట్లు అప్ప‌ట్లో ఆయ‌న ఆగ్ర‌హ వ్య‌క్తం చేసారు. సినిమాల ద్వారా సందేశాలు ఇస్తున్న‌ప్పుడు ఇలాంటి ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించ‌డం అంటే యువ‌త‌ను పెడ‌దోవ ప‌ట్టించిన‌ట్లే అవుతుంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో మ‌హేష్ కూడా ఇలాంటి ప్ర‌క‌టన నుంచి త‌ప్పుకోవాల‌ని ప‌లువురు సూచిస్తున్నారు. అయితే ఈ బ్రాండ్ ని ప్ర‌మోట్ చేస్తున్నంద‌కు మ‌హేష్ కి భారీగా ఆదాయం వ‌స్తుంద‌న్న‌ది వాస్త‌వం.

కెరీర్ ప‌రంగా మ‌హేష్ దూకుడు

ఓవైపు ప్ర‌క‌ట‌న‌ల ఆదాయం సంగ‌తి అటుంచితే.. మ‌హేష్ కి సినిమాల‌తో రెవెన్యూకి కొద‌వేమీ లేదు. ఒక్కో సినిమాకి 25కోట్ల పారితోషికం అద‌నంగా లాభాల్లో వాటాలు అందుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే. సూప‌ర్ స్టార్ మ‌హేష్ క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు పాన్ ఇండియాలో వెలిగిపోతుంది. మ‌హేష్ పాన్ ఇండియా చిత్రాలు చేయ‌న‌ప్ప‌టికీ కేవ‌లం సూప‌ర్ స్టార్ అనే బ్రాండ్ ఆ కీర్తిని తెచ్చిపెట్టింది. `భ‌ర‌త్ అనే నేను`..`మ‌హ‌ర్షి`...`స‌రిలేరు నీకెవ్వ‌రు` తో వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకుని మార్కెట్ ని రెట్టింపు పంథాలో ప‌రుగులెట్టిస్తున్నారు. ప్ర‌స్తుతం `గీతాగోవిందం` ఫేం ప‌ర‌శురాం బుజ్జితో `స‌ర్కారు వారి పాట` చిత్రంలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన వెంట‌నేమ‌హేష్ త‌న 28వ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నారు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రానికి మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు.

`అత‌డు`..`ఖ‌లేజా` త‌ర్వాత ఈ ద్వ‌యం చేతులు క‌లిపింది. ఈ ప్రాజెక్ట్ వ‌చ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో సూప‌ర్ స్టార్ 29..30వ చిత్రాల‌పై క్యూరియాసిటీ పెంచుతూ ఓ ఆస‌క్తిక‌ర అప్ డేట్ అందింది. త‌దుప‌రి నాలుగైదు చిత్రాల్ని కూడా సూపర్ స్టార్ క్యూలో పెట్టే సన్నాహాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో మ‌హేష్ ని ఐదారుగు స్టార్ మేక‌ర్స్ రౌండ‌ప్ చేసిన‌ట్లు తెలుస్తోంది. పార్క్ హ‌య‌త్ వేదిక‌గా ఈ ద‌ర్శ‌కులంతా ఒక‌రి త‌ర్వాత ఒక‌రు మ‌హేష్ ని మీట్ అయ్యార‌ని ఇంత‌కుముందు గుస‌గుస వినిపించింది. హ‌య‌త్ లో త్రివిక్ర‌మ్ తోనూ స‌మావేశ‌మయ్యారు. ఇద్ద‌రి మ‌ధ్య సుదీర్థ చ‌ర్చ జ‌రిగిన‌ట్లు స‌మాచారం.

`ఉప్పెన` ఫేం బుచ్చిబాబు సానా.. గోపీచంద్ మ‌లినేని..సందీప్ రెడ్డి వంగ కూడా మ‌హేష్ ని క‌లిసారు. ఇప్ప‌టికే సందీప్ వంగ ప్రాజెక్ట్ లైన్ అప్ లో ఉంది. దానిపై బ్రీప్ గా చ‌ర్చ జ‌రిగే ఛాన్స్ ఉంది. ఇక మిగ‌తా ఇద్ద‌రు మ‌హేష్ ని క‌లిసార‌ని క‌థ‌నాలొచ్చాయి. మ‌రో ఇద్ద‌రు ద‌ర్శ‌కులు కూడా సూప‌ర్ స్టార్ తో భేటీ అయ్యార‌ని తెలిసింది. ప్ర‌స్తుతం న‌టిస్తోన్న `స‌ర్కారు వారి పాట` వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. ఆ త‌ర్వాత ఈ ప్రాజెక్ట్ లు అన్నింటిపైనా క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.