Begin typing your search above and press return to search.

బౌలర్‌ పాత్రలో టీం ఇండియా కెప్టెన్‌ భార్య

By:  Tupaki Desk   |   8 July 2021 2:30 AM GMT
బౌలర్‌ పాత్రలో టీం ఇండియా కెప్టెన్‌ భార్య
X
సినిమా ఇండ‌స్ట్రీలో కొత్త త‌ర‌హా క‌థ‌ల‌కు ఎప్పుడూ ఆద‌ర‌ణ ఉంటుంద‌నేది అంద‌రికీ తెలిసిందే. అయితే ఇక బ‌యోపిక్‌ల‌కు కూడా అదే స్థాయిలో ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఇప్ప‌టికే ఎంతో మంది ప్ర‌ముఖుల జీవితాల‌ను తెర‌మీద అద్భుతంగా చూపించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు కొట్టారు ఎంతోమంది. ఇందులో రాజ‌కీయ, క్రీడా రంగంలో రాణించిన వారి జీవితాల‌ను తెర‌మీద అద్భుతంగా ఎంతోమంది చూపించారు. ఇందులో మ‌రీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది క్రీడా రంగంలో రాణించిన వారి గురించి.

ఇప్ప‌టికే ఇండియ‌న్ క్రికెట్ టీమ్ కూల్ కెప్టెన్‌గా దేశానికి వ‌ర‌ల్డ్ క‌ప్ అందించిన మ‌హేంద్ర సింగ్ ధోనీ మీద ఎంఎస్ ధోనీ.. ది అన్‌టోల్డ్ స్టోరీ అనే మూవీ వ‌చ్చింది ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతోమందిని మెప్పించి ప్ర‌శంస‌లు అందుకున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇక క్రికెట్ గాడ్ గా పిలుచుకునే సచిన్ టెండూల్క‌ర్‌, బ్యాడ్ మింట‌ర్ స్టార్ అయిన సైనా నెహ్వాల్ లాంటి దిగ్గ‌జ ఆట‌గాళ్ల జీవిత చ‌రిత్ర‌ల‌ను తెర‌మీద చూపించిన విష‌యం ప్ర‌తి ఒక్క‌రికీ విదిత‌మే.

అయితే ఇలా తీసిన బ‌యోపిక్‌లు చాలా వ‌ర‌కు స‌క్సెస్ అవుతున్నాయి. ఇక ఇదే క్ర‌మంలో తాజాగా టీమిండియా క్రికెట్ మహిళా జట్టు బౌల‌ర్ అయిన ఝులన్ గోస్వామి మీద బయోపిక్ తీస్తున్న‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు, గాసిప్స్ వినిపిస్తున్నాయి. కాగా ఈ మూవీ త్వరలోనే పట్టాలెక్కుతుంద‌ని తెలుస్తోంది. ఝులన్ గోస్వామి రోల్ లో ఇప్పుడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స‌తీమ‌ణి అయిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ నటిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇందుకు హింట్ ఇచ్చే విధంగా గతేడాది ప్రారంభంలోనే అనుష్కశర్మ టీమిండియా జెర్సీలో మెర‌వ‌డంతో అప్ప‌టి నుంచే ఊహాగానాలు మిన్నంటాయి.

అప్ప‌ట్లోనే కోల్‌కతాలోని ఈడెన్ గ్రౌండ్స్‌లో ఝులన్ గోస్వామితో కలిసి అనుష్క శ‌ర్మ దిగిన కొన్ని ఫొటోలు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. దీంతో ఈ గాసిప్స్‌కు మరింత బలం చేకూరి టాక్ ఆఫ్ ది బాలీవుడ్ గా మారిపోయాయి. కాక‌పోతే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎలాంటి అప్ డేట్ ఇప్ప‌టి దాకా రాలేదు. ఇదిలా ఉండ‌గా రీసెంట్ గా బాలీవుడ్‌ హంగామా అనే మూవీ మ్యాగజీన్ ఓ ఇంట్రెస్టింగ్ విష‌యాన్ని సినీ లోకానికి చెప్పింది. 2021 సంవ‌త్స‌రం చివరినాటికి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుంద‌ని తెలిపింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చాలా స్పీడ్ గా జ‌రుగుతోంద‌ని, త్వ‌ర‌లోనే దానికి సంబంధించిన అప్‌డేట్ కూడా వ‌స్తుంద‌ని వెల్లడించింది.

టీం ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ని పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్లు సినిమాలు చేసిన అనుష్క ఇటీవల తల్లి అవ్వడంతో సినిమాలకు దూరంగా ఉంటుంది. గత కొన్నాళ్లుగా సినిమాలు చేయని అనుష్క పాప కాస్త పెద్ద అయిన తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వస్తుందని అంటున్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం టీమ్‌ ఇండియా క్రీడాకారిణిగా అనుష్క నటించేందుకు కోహ్లీ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని.. ఆయన ప్రోత్సాహంతోనే ఆమె ఆ పాత్రను చేసేందుకు కమిట్‌ అయ్యిందని అంటున్నారు.

అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2023 లో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని కూడా ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. పెద్ద ఎత్తున ఈ బయోపిక్‌ ను నిర్మించేందుకు గాను నిర్మాతలు సిద్దంగా ఉన్నారు. ఇప్పటికే క్రికెటర్‌ లపై వచ్చిన బయోపిక్ లు సూపర్‌ హిట్ అయ్యాయి. కనుక ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ బయోపిక్ వెండి తెరపై సందడి చేస్తుందో అంటూ ప్రతి ఒక్క క్రికెట్‌ అభిమాని ఎదురు చూస్తున్నారు.