Begin typing your search above and press return to search.

సర్కారు వారిని పాన్ ఇండియా వైడ్ ఎందుకు రిలీజ్ చేయడం లేదు..?

By:  Tupaki Desk   |   6 May 2022 11:30 PM GMT
సర్కారు వారిని పాన్ ఇండియా వైడ్ ఎందుకు రిలీజ్ చేయడం లేదు..?
X
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అయింది. పరశురామ్ పెట్లా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మే 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

మహేష్ 'పోకిరి' మరియు పరశురాం 'గీతా గోవిందం' సినిమాలు కలిపితే ఎలా ఉంటుందో ''సర్కారు వారి పాట'' మూవీ అలా ఉంటుందని మేకర్స్ చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఇటీవల రిలీజ్ చేసిన SVP ట్రైలర్ 32 మిలియన్లకు పైగా వ్యూస్ తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇది సినిమాకు చాలా మంచి బజ్ తెచ్చిపెట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బాలీవుడ్ మీడియాలో కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు.

అయితే 'సర్కారు వారి పాట' చిత్రాన్ని పాన్ ఇండియాలో స్థాయిలో విడుదల చేయడం లేదు. తెలుగుతో పాటుగా తమిళ్ లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి కానీ.. అధికారికంగా మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. మహేష్ అభిమానులు మాత్రం ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో రిలీజ్ చేయాలని కోరుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో SVP సినిమాని ఇతర భాషల్లో ఎందుకు చేయడం లేదనే విషయం పై దర్శకుడు పరశురామ్‌ ఇటీవల స్పందించారు. మొదటి నుంచీ తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సర్కారు వారి స్క్రిప్ట్‌ రాసుకున్నానని తెలిపారు. ఇందులో హీరో పాత్రలో ఎమోషనల్ థ్రెడ్ ఉంటుందని.. అది లోకల్ గా కనెక్ట్ అయి ఉంటుందని చెప్పారు.

ఇప్పుడు తెలుగు సినిమాలు బాగా ఆడుతున్నాయి కదా అని పాన్ ఇండియా ఎలిమెంట్స్ జోడించి స్క్రిప్ట్‌ ని డైల్యూట్ చేయకూడదని అభిప్రాయ పడ్డారు. మహేష్ బాబు ఇమేజ్‌ ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని కథను తెరకెక్కించానని దర్శకుడు అన్నారు.

సూపర్ స్టార్ కు ఇండియా వైడ్‌ గా విపరీతమైన ఫాలోయింగ్ ఉందని తనకు బాగా తెలుసునని.. కానీ పాన్ ఇండియా విడుదల కోసం కొత్తగా ఎలిమెంట్‌లను జోడించలేనని.. అది మహేష్‌ కి కూడా ఇష్టం లేదని పరశురాం తెలిపారు.

మహేష్ తో సినిమా అనేది తన లైఫ్ టైం అచీవ్ మెంట్ అని.. 'సర్కారు వారి పాట' కథ ఆయన కోసమే పుట్టిందని పరశురాం పేర్కొన్నారు. సినిమా చాలా బాగా వచ్చిందని.. మహేష్ బాబు అభిమానులకు ఇదో ట్రీట్ అని డైరెక్టర్ చెప్పుకొచ్చారు.

సర్కారు వారి చిత్రంలో మహేశ్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. మైత్రీ మూవీ మేకర్స్ - GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు.