Begin typing your search above and press return to search.

'గృహం' దర్శకుడితో రానా త్రిభాషా చిత్రం ఎప్పుడంటే..?

By:  Tupaki Desk   |   19 Dec 2020 5:15 PM IST
గృహం దర్శకుడితో రానా త్రిభాషా చిత్రం ఎప్పుడంటే..?
X
మణిరత్నం వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన మిలింద్ రౌ 'కాదల్ 2 కళ్యాణం' అనే తమిళ్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత సిద్దార్థ్ హీరోగా తెలుగు తమిళ హిందీ భాషల్లో 'గృహం' అనే హారర్ థ్రిల్లర్‌ సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో 'నెట్రికన్‌' అనే మిస్టరీ థ్రిల్లర్ ని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత మిలింద్ టాలీవుడ్ హ్యాండ్స‌మ్ హంక్ ద‌గ్గుబాటి రానాతో ఓ త్రిభాషా చిత్రాన్ని తెరకెక్కిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఓ వైవిధ్యమైన సినిమా చేయడానికి స్టోరీ రెడీ చేసుకున్న మిలింద్ కి రానా నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో విశ్వశాంతి పిక్చర్స్ బ్యానర్ పై ఆచంట గోపీనాథ్ నిర్మించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్థంలో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.

కాగా, 'బాహుబలి' సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న రానా.. తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లో కూడా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్‌ గా మారిపోయాడు. రానా నటించిన త్రిభాషా చిత్రం 'అరణ్య' విడుదలకు సిద్ధంగా ఉంది. నేషనల్ అవార్డ్‌ గ్రహీత ప్ర‌భు సాల్మ‌న్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అలానే 'నీదీ నాదీ ఒకే క‌థ' ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం' అనే సోషల్ డ్రామాలో నటిస్తున్నాడు రానా. 1990ల నాటి నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రానా కామ్రేడ్ రవన్న పాత్రలో కనిపించనున్నాడు. డి.సురేష్ బాబు సమర్పణలో ఎస్‌.ఎల్‌.వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అంతేకాక గుణశేఖర్ దర్శకత్వంలో 'హిరణ్యకశ్యప' అనే భారీ ప్రాజెక్ట్ కూడా రానా లైనప్ లో ఉంది.