Begin typing your search above and press return to search.

మెగా హీరోలకు ఏమైంది..??

By:  Tupaki Desk   |   4 May 2022 10:30 AM GMT
మెగా హీరోలకు ఏమైంది..??
X
టాలీవుడ్ లో మిగతా ఫ్యామిలీల కంటే మెగా హీరోల డామినేషన్ ఉంటుందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. మెగా ఫ్యామిలీలో దాదాపు డజను మంది హీరోలు ఉన్నారు కాబట్టి.. మామూలుగానే ఏడాదిలో ఎక్కువ శాతం వారు నటించిన సినిమాలే థియేటర్లలోకి వస్తుంటాయి. అందుకే బాక్సాఫీస్ వద్ద మెగా చిత్రాల సందడే కనిపిస్తుంది.

అయితే ఇటీవల కాలంలో మెగా హీరోలు నటించిన సినిమాలు.. బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోతుండటంతో అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్నారని తెలుస్తోంది. కరోనా పాండమిక్ కారణంగా గత రెండేళ్లలో ఎక్కువ సినిమాలు రిలీజ్ కాలేదు. అయితే విడుదలైన కొన్ని సినిమాల్లోనూ ఏ ఒక్కటీ రికార్డులు క్రియేట్ చేయకపోవడం మెగా ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది.

'వకీల్ సాబ్' తో పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రీమేక్ అయినప్పటికీ.. చాలా గ్యాప్ తర్వాత పవర్ స్టార్ నటించిన మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా హిట్ టాక్ తో కూడా బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోలేకపోయింది. అధికారిక లెక్కలు తెలియనప్పటికీ చాలా ఏరియాల్లో బయ్యర్లకు నష్టాలు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్' 'రిపబ్లిక్' వంటి రెండు బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్ సినిమాలు అందుకున్నాడు. సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్ కూడా 'కొండపొలం' చిత్రంతో డిజాస్టర్ చవిచూశాడు. దీంతో అన్నదమ్ములిద్దరూ రాబోయే తదుపరి సినిమాలతో కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక సంక్రాంతికి 'సూపర్ మచ్చి' అంటూ వచ్చిన మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ ప్లాప్ తో సరిపెట్టుకున్నాడు.

ఇదే క్రమంలో ఈ ఏడాది ప్రారంభంలో పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మలయాళ రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి హిట్ టాక్ రావడమే కాదు.. పాజిటివ్ రివ్యూలు రేటింగులు వచ్చాయి. అయినప్పటికీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసి.. సరికొత్త రికార్డులను సృష్టించలేకపోయింది. భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా.. ఫైనల్ రన్ పూర్తయ్యే నాటికి అబౌ యావరేజ్ గా నిలిచింది.

ఇటీవల థియేటర్లలోకి వచ్చిన 'ఆచార్య' సినిమా డిజాస్టర్ దిశగా పయనిస్తోంది. తండ్రీకొడుకులు మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ మూవీ.. మిశ్రమ స్పందన రావడం వల్ల ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వసూళ్ళు చూసి మెగా అభిమానులు పూర్తిగా నిరుత్సాహానికి గురయ్యారు.

అంతకుముందు మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన 'గని' సినిమా భారీ ప్లాప్ అందుకున్న సంగతి తెలిసిందే. మధ్యలో రామ్ చరణ్ 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నా.. ఆ క్రెడిట్ ఒక్కరికే ఇవ్వలేం. అందులో మరో హీరో ఎన్టీఆర్ కు భాగం ఉంది. అంతకుమించి అది దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి బ్రాండ్ తో వచ్చిన సినిమా. కాబట్టి ఆ సక్సెస్ ఎవరి ఖాతాలోకి వెళ్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఓవైపు మెగా హీరోలంతా బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోతుంటే.. మరోవైపు మెగా ఫ్యామిలీకి దూరంగా అల్లు బ్రాండ్ తో ఎదుగుతున్న బన్నీ మాత్రం బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా సర్క్యూట్‌ లో సంచలనం సృష్టించాడు. అందుకే రాబోయే రోజుల్లో మెగా హీరోలు బాక్సాఫీస్ వద్ద తమ సత్తా ఏంటో చూపించాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మెగా హీరోల సినిమాల విషయానికొస్తే.. చిరంజీవి ప్రస్తుతం 'గాడ్ ఫాదర్' 'భోళా శంకర్' 'వాల్తేరు వీరయ్య' వంటి సినిమాలలో నటిస్తున్నారు. త్వరలో మరికొన్ని చిత్రాలు సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. 'హరి హర వీరమల్లు' సినిమాలో నటిస్తున్న పవన్ కళ్యాణ్.. 'భవదీయుడు భగత్ సింగ్' రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు.

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో RC15 మూవీ చేస్తున్నారు. దీని తర్వాత గౌతమ్ తిన్ననూరి సినిమాని మొదలు పెట్టనున్నారు. వరుణ్ తేజ్ నటించిన 'ఎఫ్ 3' చిత్రం మే 27న విడుదల కాబోతోంది. వైష్ణవ్ తేజ్ 'రంగ రంగ వైభవంగా'.. కళ్యాణ్ దేవ్ 'కిన్నెరసాని' సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. సాయి ధరమ్ తేజ్ ఇటీవలే తిరిగి సెట్స్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.