Begin typing your search above and press return to search.

తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపు పై విజయ్ దేవరకొండ హర్షం..!

By:  Tupaki Desk   |   25 Dec 2021 3:05 PM IST
తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపు పై విజయ్ దేవరకొండ హర్షం..!
X
తెలంగాణలో సినిమా టికెట్‌ ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీ పెద్దల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం శుక్రవారం ఈ నిర్ణయం తీసుకుంది. టికెట్ రేట్ల పెంపుపై అధికారుల ప్రతిపాదనలు పరిశీలించిన తెలంగాణ సర్కారు.. టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ జీవో జారీ చేసింది. దీనిపై టాలీవుడ్ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్‌ చిరంజీవి ప్రభుత్వానికి ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ క్రమంలో తాజాగా యంగ్ సెన్సేషనల్ విజయ్ దేవరకొండ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో.. హీరో విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో సినీ పరిశ్రమను నూటికి నూటొక్క శాతం అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని విజయ్ దేవరకొండ అన్నారు. దేశంలోని అతి పెద్ద పరిశ్రమలలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒకటని పేర్కొన్న విజయ్... చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం సినిమా టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం పాటుపడుతున్న తెలంగాణ సర్కార్ కు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అని విజయ్ దేవరకొండ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు మంత్రులు కేటీఆర్ - తలసాని శ్రీనివాస్ యాదవ్ లు రాష్ట్రంలో ఆరోగ్యకరమైన అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని వీడీ కొనియాడారు. తన ప్రభుత్వాన్ని ఎంతో ప్రేమిస్తున్నానని పేర్కొన్న విజయ్.. సినిమా టికెట్ ధరలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు.

కాగా, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల వ్యవహారం గురించే పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సినిమా టికెట్‌ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటే.. మరోవైపు తెలంగాణలో టికెట్‌ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ జీవో జారీ చేసింది. ఏసీ థియేటర్‌లలో కనిష్ఠ ధర రూ.50 - గరిష్ఠంగా రూ.150గా టికెట్‌ ధరను నిర్ణయించారు. అలానే మల్టీప్లెక్స్‌ లలో కనీస టికెట్‌ ధర రూ.100 - గరిష్ఠంగా రూ.250 ధరను ఖరారు చేశారు. సింగిల్‌ థియేటర్లలో స్పెషల్‌ రిక్లైనర్‌ సీట్లకు రూ.200 - మల్టీప్లెక్స్‌ లలో రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. వీటికి జీఎస్టీ ని అదనంగా విధిస్తారు.