Begin typing your search above and press return to search.

వివాదాస్పద సినిమాకు సెన్సార్‌ సాధించిన వర్మ

By:  Tupaki Desk   |   8 Dec 2020 2:13 PM IST
వివాదాస్పద సినిమాకు సెన్సార్‌ సాధించిన వర్మ
X
మిర్యాలగూడెంలో జరిగిన పరువు హత్య నేపథ్యంలో వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన సినిమా మర్డర్‌ విడుదలకు సిద్దం అయ్యింది. ఆ సినిమాను అడ్డుకోవాలంటూ అమృత కోర్టును ఆశ్రయించింది. మొదట కోర్టు వర్మ సినిమాపై స్టే విధించింది. అయితే హైకోర్టుకు వెళ్లిన వర్మ తన సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ తెచ్చుకున్నాడు. సినిమా విడుదలకు సెన్సార్‌ ఇబ్బందులు తప్పవని అంతా భావించారు. సెన్సార్‌ వారు సినిమా విడుదల విషయంలో అడ్డు చెప్పే అవకాశం ఉందని అంతా భావించారు. కాని అనూహ్యంగా సెన్సార్‌ క్లియరెన్స్ ను కూడా వర్మ తెచ్చుకున్నాడు.

రామ్‌ గోపాల్‌ వర్మ గతంలో ఇలాంటి ఎన్నో వివాదాస్పద సినిమాలను చేశాడు.. వాటికే సెన్సార్‌ ఇబ్బంది రాలేదు. దీనికి ఎలా అంటూ కొందరు అనుకున్నారు. మర్డర్‌ టైటిల్‌ తో రూపొందిన ఈ సినిమా సెన్సార్‌ సర్టిఫికెట్‌ వచ్చింది అంటూ సగర్వంగా వర్మ ట్విట్టర్‌ లో షేర్‌ చేశాడు. అన్ని అడ్డంకులు తొలగి పోయిన మర్డర్‌ సినిమా విడుదల అవ్వబోతుంది.. థియేటర్లలో చంపేందుకు సిద్దంగా ఉన్నాం అంటూ కామెంట్‌ పెట్టాడు. ఈ సినిమాలో అమృత మరియు మారుతిరావులకు సంబంధించిన సన్నివేశాలను చూపిస్తాడని క్లియర్‌ గా తెలుస్తోంది. కాని వర్మ మాత్రం ఇదో కల్పిత కథ అంటున్నాడు. మిర్యాలగూడెం సంఘటన సంచలనం సృష్టించింది. అందుకే ఈ సినిమాపై జనాల్లో ఆసక్తి కనిపిస్తుంది. ఈ సినిమాను వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు థియేటర్ల ద్వారా తీసుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.