Begin typing your search above and press return to search.

పూరి కథ చెప్పింది నాకు .. సినిమా తీసింది బన్నీతో!

By:  Tupaki Desk   |   14 July 2022 2:30 AM GMT
పూరి కథ చెప్పింది నాకు .. సినిమా తీసింది బన్నీతో!
X
వేణు తొట్టెంపూడి .. హీరోగా చేసినవి కొన్ని సినిమాలే అయినా గుర్తుండిపోయేవే చేశాడు. పదేళ్ల పాటు ఆయన సినిమాలకి దూరంగా ఉన్నప్పటికీ జనాలకు గుర్తుండిపోవడానికి కారణం ఆయన బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీ. 'దమ్ము' సినిమాలో కేరక్టర్ ఆర్టిస్టుగా చేసిన ఆయన ఆ తరువాత కనిపించలేదు. ఆయన అలా హఠాత్తుగా సినిమాలను ఎందుకు పక్కన పెట్టేశారన్నది ఎవరికీ తెలియదు. ఇంతకాలంగా ఆయన ఏం చేస్తున్నదీ ఎవరికీ తెలియదు.

ఏదో బిజినెస్ చేస్తున్నాడని కొంతమంది అంటే .. రాజకీయాల్లోకి వెళ్లడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాడని మరికొందరు అన్నారు. సామాన్య ప్రేక్షకులకు మాత్రం ఆయన ఏమైపోయాడనేది తెలియదు.

మధ్యలో కొంతమంది మేకర్స్ ఆయనను సంప్రదించినట్టుగా .. ఆయన సినిమాలు చేయనని చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. అంతగా ఆయన మనసుకి ఏం కష్టం కలిగిందబ్బా అని అంతా అనుకున్నారు. అలాంటి వేణు 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం.

ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో వేణు మాట్లాడుతూ, గతంలో జరిగిన కొన్ని సంఘటనలను గురించి చెప్పుకొచ్చారు. " పూరిగారు చేసిన 'ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం' సినిమా సూపర్ హిట్ అయిన సంగతి మీకు తెలుసు కదా. ఆ సినిమాను నాతోనే చేయాలని ఆయన అనుకున్నారు. ముందుగా నాకే ఆ కథను చెప్పారు .. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమాను నేను చేయలేకపోయాను.

ఇక బన్నీతో పూరి చేసిన 'దేశముదురు' సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందనేది అందరికీ తెలిసిందే. ఆ కథను కూడా ముందుగా పూరి నాకే చెప్పారు. 'ఈ సినిమాలో హీరో నువ్వే' అని చెప్పేసి వెళ్లి బన్నీతో ఆ సినిమాను తీసేశారు" అంటూ నవ్వేశారు.

ఒక కథను ఒక హీరో కోసం అనుకుంటే అది మరో హీరోతో సెట్స్ పైకి వెళ్లడమనేది కామన్ గానే జరుగుతూ ఉండేదే. 'ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం' అయితే వేణు బాడీ లాంగ్వేజ్ కి సరిపోతుందని అనుకోవచ్చు. కానీ ఎటు చూసినా 'దేశముదురు' బన్నీకి మాత్రమే సెట్ అవుతుందేనని అనిపించకమానదు. మరి అలాంటప్పుడు వేణుని పూరి ఎలా అనుకున్నాడనేది ఆశ్చర్యంగా లేదూ!