Begin typing your search above and press return to search.

'మర్డర్‌' దారిలోనే వర్మ 'దిశ ఎన్‌ కౌంటర్‌' కూడా..!

By:  Tupaki Desk   |   11 Oct 2020 1:20 PM IST
మర్డర్‌ దారిలోనే వర్మ దిశ ఎన్‌ కౌంటర్‌ కూడా..!
X
వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తన కెరీర్‌ లో ఇప్పటి వరకు ఎన్నో వివాదాస్పద సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ముంబయి మాఫియా నుండి విజయవాడ వంగవీటి వరకు ఎన్నో వివాదాస్పద అంశాలను సినిమాలుగా తీసి విడుదల సమయంలో వివాదాలను ఎదుర్కొన్నాడు. అయినా కూడా ఆయన వివాదాస్పద సినిమాలను తీయడంలో మాత్రం వెనక్కు తగ్గడం లేదు. గతంలో ఎన్ని వివాదాలు వచ్చిన తన సినిమాలను విడుదల చేసుకున్న వర్మ ఈసారి రెండు సినిమాలను మాత్రం కనీసం షూటింగ్‌ పూర్తి చేసే అవకాశం కూడా లేదంటున్నారు. మిర్యాలగూడెం పరువు హత్యకు సంబంధించి మర్డర్‌ అనే సినిమాను వర్మ తీసేందుకు సిద్దం అయ్యాడు. షూటింగ్‌ కూడా చేశాడు.

ఆ సినిమా విడుదల అనుకుంటూ ఉండగా అమృత పోలీసులను ఆశ్రయించడంతో ఆ సినిమా అలా ఆగిపోయింది. మర్డర్‌ సినిమా విడుదల అయ్యేనా లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఇదే సమయంలో ఆయన హైదరాబాద్‌ శంషాబాద్‌ లో జరిగిన దిశ రేప్‌ సంఘటనపై దిశ ఎన్‌ కౌంటర్‌ అంటూ సినిమా తీశాడు. ఆ సినిమా షూటింగ్‌ కూడా ముగింపు దశకు వచ్చింది. ఈ సమయంలో దిశ తండ్రి మీడియా ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదల చేసిన ప్రోమోను మరియు ఇప్పటి వరకు షూట్‌ చేసిన సినిమా మొత్తంను కూడా డిలీట్‌ చేయాలని డిమాండ్‌ చేశాడు. సినిమా విడుదలపై తాను న్యాయ పోరాటం చేస్తానంటూ హెచ్చరించాడు.

చనిపోయిన ఒక అమ్మాయి విషయాన్ని తీసుకుని సినిమా తీయడం.. దాని వల్ల కుటుంబ సభ్యులకు ఎంతగా మానసిక ఆవేదన ఉంటుందో అర్థం చేసుకోరా అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన న్యాయ పోరాటం చేస్తే దిశ మూవీ కూడా ఆగిపోయే అవకాశం ఉంది. ఈ విషయాల్లో వర్మ గట్టిగా మాట్లాడటానికి లేకుండా పోయింది. సున్నితమైన విషయాలు అవ్వడం వల్ల ఆయన మాటలను ఎవరు స్వాగతించే అవకాశం లేదు. ఈ రెండు సినిమాలను ఆయన వదిలేయాల్సి రావచ్చు అంటున్నారు.