Begin typing your search above and press return to search.

మరో ప్రాణం తీసిన మహమ్మారి..సినీ రచయిత మృతి

By:  Tupaki Desk   |   13 Nov 2020 9:00 AM IST
మరో ప్రాణం తీసిన మహమ్మారి..సినీ రచయిత మృతి
X
కరోనా మహమ్మారి సినిమా ఇండస్ట్రీపై పగబట్టినట్టుంది. వరుస బెట్టి నటీనటులు, ఇతర విభాగాలకు చెందిన వారు మహమ్మారి బారిన పడుతున్నారు. దిగ్గజ నేపథ్య గాయకుడు బాల సుబ్రహ్మణ్యం కరోనాతో మృతి చెందటం సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని కలచి వేసింది. చిన్న చిన్న టెక్నిషియన్లు, జూనియర్​ ఆర్టిస్టులు ఎంతమందికి ఈ మహమ్మారి సోకిందో లెక్కేలేదు. కరోనావైరస్‌ సోకి హీరో రాజశేఖర్‌ చాలా అవస్థలు పడ్డారు. మొదట్లో ఆయన పరిస్థితి సీరియస్ గా మారిందని వార్తలు రావడంతో అంతా కంగారు పడ్డారు. ఆ తర్వాత ఆయన కోలుకుని ఇంటికి చేరారు. ఇంతలోనే మెగాస్టార్‌ చిరంజీవికి కోవిడ్‌-19 పాజిటివ్‌ నిర్దారణ అయిందని ప్రకటించగానే అంతా దిగ్భ్రాంతి చెందారు. అయితే ఆయనకు మళ్లీ నెగిటివ్​ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.

తాజాగా టాలీవుడ్‌ యువ కథా రచయిత వంశీ రాజేష్ కరోనా బారిన పడి కన్నుమూశారు. కొన్ని రోజుల కిందట లక్షణాలు కనిపించగా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడంతో పాజిటివ్ తేలింది. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ రాగా గురువారం ఆరోగ్యం విషమించి తుది శ్వాస విడిచారు.వంశీ రాజేష్ ఆకస్మిక మరణంతో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం ప్రకటించారు. చిన్న వయసు అయినా కరోనా తీవ్రత అధికంగా ఉండటంతోనే రాజేష్ మృతి చెందినట్లు చెబుతున్నారు.

శ్రీను వైట్ల దర్శకత్వంలో, రవితేజ నటించిన 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమాకు రాజేష్ మాటలు రాశారు. అంతకుముందు కూడా పలువురి దగ్గర అసిస్టెంట్​గా పనిచేశారు. వంశీ మృతి చెందినట్లు తెలుసుకున్న పలువురు సినీప్రముఖులు సంతాపం తెలిపారు. ఎంతో భవిష్యత్ ఉన్న ఓ యువరచయితను ఇండస్ట్రీ కోల్పోయిందని వారు అభిప్రాయపడ్డారు. తన దగ్గర పనిచేసిన వ్యక్తి వైరస్ బారిన పడి మృతి చెందటంతో ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల దిగ్భ్రాంతి చెందారు. ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.