Begin typing your search above and press return to search.

రివ్యూల కంటే జనం ఫీలింగేంటి?

By:  Tupaki Desk   |   12 May 2019 4:43 AM GMT
రివ్యూల కంటే జనం ఫీలింగేంటి?
X
సమీక్షకులు కామన్ ఆడియెన్ పాయింట్ ఆఫ్ వ్యూని అడాప్ట్ చేసుకుని సినిమాలపై రివ్యూలు రాస్తుంటారు. జనం పాయింట్ ఆఫ్ వ్యూ తో పాటు తమ పాయింట్ ఆఫ్ వ్యూని సమీక్షల్లో చెబుతుంటారు. వాటితో మెజారిటీ పార్ట్ పాఠకులు ఏకీభవిస్తే ఆ సమీక్షకుడిని రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారు. విశ్లేషణ బావుంది అంటేనే అతడు రాసే తర్వాతి రివ్యూని చదివేందుకు ఆసక్తి చూపిస్తారు. బావున్నది బాలేదనీ.. బాలేనిది బావుంది అని రాస్తే ఆ సమీక్షకుడిని అనుసరించే వాళ్లు తగ్గిపోతారు. అందువల్ల రివ్యూలు రాసేవాళ్లపై పడి ఏడిస్తే వచ్చే లాభం ఏదీ ఉండదు. వీళ్లు రివ్యూల రాయడం ఆగదు.. వాళ్లు సినిమాలు తీయడం ఆపరు.

అదంతా సరే కానీ పాజిటివ్ రివ్యూలు రాసినప్పుడు వాటిని సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా ప్రమోట్ చేసుకునే మన దర్శకహీరోలు .. నిర్మాతలు నెగెటివ్ రివ్యూలను ఎందుకు సహించలేరు? అన్నది నిరంతరం హీటెక్కించే టాపిక్. అప్పట్లో చాలా సందర్భాల్లో తన సినిమాలకు నెగెటివ్ సమీక్షలు వచ్చినప్పుడు యంగ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ చాలానే ఎమోషనల్ అయిన సందర్భాలున్నాయి. రివ్యూలు రాసేవాళ్లపై ఫైరైన సందర్భం ఉంది. పూరి జగన్నాథ్ లాంటి స్టార్ డైరెక్టర్ తన సినిమాల్లో జర్నలిస్టులకు క్లాసులే తీసుకున్నారు. ఆర్జీవీ అయితే అసలు జర్నలిజాన్ని తన అవసరానికి వాడుకుని విసిరేయగలడు. తన సినిమాలపై నెగెటివ్ కామెంట్లు చేసిన రివ్యూవర్లపై బోయపాటి తనదైన శైలిలో సమీక్షలు చేసుకుని సున్నితంగా ప్రతి విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. వీళ్లు వాళ్లు అనే కాదు కానీ.. చాలా మంది మన దర్శకనిర్మాతలు ఎన్నో నాశిరకం సినిమాలు తీసి ప్రేక్షకులపై రుద్ధి మేం తీసిందే వేదం.. పంచాంగం.. కళాఖండం అని భావిస్తూ రివ్యూలు రాసిన వాళ్లను తిట్టిన సందర్భాలు అనేకం చూస్తూనే ఉన్నాం. పాజిటివ్ గా రాస్తేనే రివ్యూనా.. బాలేనప్పుడు నెగెటివ్ గా రాసేది రివ్యూ కాదా? రెండిటినీ సమానంగా తీసుకోలేరా? అన్నది వాళ్లే చెప్పాలి.

ఇటీవలే `మహర్షి` చిత్రం థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకి క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. కలెక్షన్ల పరంగా ఇదీ అంటూ రిపోర్టులు కూడా వచ్చేశాయి. అయితే తన సినిమాలపై మిశ్రమ స్పందనలు రావడంపై వంశీ పైడిపల్లి కాస్తంత నిరాశ చెందారని ఆయన మాటల్ని బట్టి అర్థమవుతోంది. మహర్షి చిత్రం నిడివిపై ఫిర్యాదు చేస్తున్నారంతా. అయితే ప్రథమార్థం ఒక బ్యాక్ డ్రాప్ .. ద్వితీయార్థం వేరొక బ్యాక్ డ్రాప్.. ఇవి రెండూ రెండు సినిమాలు చూసిన ఫీలింగ్ ని ఇస్తాయి. మొదటి భాగం లేకపోతే రెండో భాగం లేదు. అంత గొప్ప కనెక్టివిటీ ఉంటుంది. లేయర్స్ ఎక్కువ వున్న చిత్రమిది. అందుకే నిడివి ఎక్కువైంది అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారాయన. అయితే తన సాఫ్ట్ మనస్తత్వానికి తగ్గట్టే రివ్యూవర్లపై ఆయనేమీ విరుచుకుపడలేదు. కేవలం తన బాధను మాత్రం వ్యక్తం చేశారంతే. సినిమాకు వ‌చ్చిన రివ్యూలు ఎలా ఉన్నా.. స‌గ‌టు ప్రేక్ష‌కుడు థియేట‌ర్‌లో ఏం ఫీల‌వుతున్నాడ‌న్న‌దే ముఖ్య‌ం అంటూ వంశీ చేసిన కామెంట్ సరైనది. రిలీజ్ ల టైమ్ లో ప్రతి దర్శకనిర్మాత ఇలా ఫీలయితే తప్పేమీ కాదు. అలా కాకుండా మనసులో పెట్టుకుని రివ్యూవర్లను తిట్టేయడం సరికాదని వంశీ సరిగ్గానే చెప్పారు. ఇకపోతే మహర్షి చిత్రం 100 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేసింది కాబట్టి.. ఆ మేరకు షేర్ వసూలు చేయాల్సి ఉంది. ఇప్పటికే మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి కాబట్టి ఆరంభ వసూళ్ల దూకుడును కొనసాగించేలా టీమ్ రిగరస్ గా ప్రమోట్ చేస్తుందేమో చూడాలి. ఇప్పటికి మహర్షి 32 కోట్ల షేర్ వసూలు చేసింది.