Begin typing your search above and press return to search.

'వీరయ్య vs వీర సింహా' అని కాకుండా 'చిరు+బాలయ్య' అని ఆలోచిస్తే..!

By:  Tupaki Desk   |   8 Nov 2022 5:41 AM GMT
వీరయ్య vs వీర సింహా అని కాకుండా చిరు+బాలయ్య అని ఆలోచిస్తే..!
X
2023 సంక్రాంతి సీజన్ లో బరిలో దిగాలని పలువురు స్టార్ హీరోలు ప్రయత్నాలు చేసారు. పోటాపోటీగా తమ సినిమాలు పండక్కి రిలీజ్ అవుతాయని పోస్టర్స్ వదిలారు. మధ్యలో డబ్బింగ్ చిత్రాలు కూడా వచ్చాయి. దీంతో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఫెస్టివల్ కు అర డజను సినిమాలు వస్తాయేమో అనే భ్రమలు కలిగించారు. కానీ చివరకు బాక్సాఫీర్ వార్ లో రెండు స్ట్రెయిట్ తెలుగు చిత్రాలు.. రెండు డబ్బింగ్ సినిమాలు మాత్రమే మిగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం 'ఆదిపురుష్' ను జనవరి 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు మెరుగైన అవుట్ ఫుట్ ను అందించడానికి టీమ్ కు మరికొంత సమయం అని చెబుతూ ఈ సినిమాని జూన్ కు వాయిదా వేశారు. ఇక యూత్ కింగ్ అఖిల్ అక్కినేని నటిస్తున్న 'ఏజెంట్' చిత్రాన్ని కూడా వచ్చే పొంగల్ రేసులో దింపనున్నట్లు ఇటీవల అనౌన్స్ చేసారు. అయితే ఇప్పుడు విడుదల విషయంలో పురాలోచనలో పడ్డట్లు టాక్ వినిపిస్తోంది.

ఈ విధంగా రెండు సినిమాలు పోటీ నుంచి తప్పుకునే పరిస్థితి రావడంతో.. పెద్ద పండక్కి ఇద్దరు పెద్ద హీరోలకు కలిసొచ్చింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ''వాల్తేరు వీరయ్య'' మరియు నటసింహం నందమూరి బాలకృష్ణ చేస్తున్న ''వీరసింహా రెడ్డి'' సినిమాలు సంక్రాంతికి ఢీకొట్టబోతున్నాయి. ఒక్కరోజు గ్యాప్ తో రెండు సినిమాలు వస్తుండటంతో చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ వద్ద హోరాహోరీ నడుస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో మెగా - నందమూరి అభిమానులు మాటల యుద్ధాలతో రెచ్చిపోతున్నారు. గత రికార్డులను ప్రస్తావించుకుంటూ.. ఈసారి గెలుపెరిదనే అంశం మీద పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. అయితే ఇక్కడ వాల్తేరు వీరయ్య vs వీర సింహా రెడ్డి అని గొడవలు పడటం ఆపేసి.. 'చిరంజీవి + బాలయ్య' అని ఆలోచిస్తే రెండు సినిమాలకూ ప్రయోజనం చేకూరుతుందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

బాలకృష్ణ మరియు చిరంజీవి సినిమాలు కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లోనే రుపొందాయనే సంగతి తెలిసిందే. ఒకే సంస్థలో నిర్మించబడిన రెండు చిత్రాలను ఒకేసారి రిలీజ్ చేయడం అనేది ఎప్పుడూ జరగదు. తమ సినిమాల మధ్యే క్లాష్ అంటే కలెక్షన్స్ మీద ప్రభావం పడుతుంది కాబట్టి.. ఎవరూ అలాంటి సాహసం చేయరు. కానీ ఇప్పుడు మైత్రీ నిర్మాతలకు తప్పడం లేదు. ఒకటీ రెండు రోజుల తేడాతో విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

అయితే నిర్మాత శ్రేయస్సు కోసం రెండు సినిమాల వార్ గా కాకుండా.. రెండూ ఒకటే అనే విధంగా ప్రచారం చేయాల్సిన అవసరముంది. చిరు - బాలయ్య విడివిడిగా తమ చిత్రాలను ప్రమోట్ చేసినప్పటికీ, ఇద్దరూ కలిసి ప్రమోట్ చేస్తే ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది. రెండు చిత్రాల ప్రమోషన్స్ కోసం.. ఇద్దరు సమకాలీన హీరోలను ఒకే వేదిక మీదకు తీసుకురాగలిగితే ఆలోచన చేస్తే ఇంకా బాగుంటుంది.

ఒకరి ఈవెంట్స్ కు మరొకరిని గెస్టుగా రావడం లేదా రెండు సినిమాలకూ కలిపి ఒకే ఈవెంట్ చేయడం వంటివి నిర్మాతలకు అదనపు ప్రయోజమని చెప్పాలి. బాలకృష్ణ ఎలాగూ 'అన్‌ స్టాపబుల్' టాక్ షోకి హోస్ట్ గా చేస్తున్నారు కాబట్టి.. ప్రస్తుతం కొనసాగుతున్న రెండో సీజన్ కు చిరంజీవిని గెస్టుగా తీసుకొస్తే సరిపోతుంది. ఈ కలయిక కచ్చితంగా ప్రేక్షకులకు ట్రీట్ ఇస్తుంది. నిజానికి ఇరు వర్గాల అభిమానుల మధ్య ఘర్షణ వాతావరణాన్ని తగ్గించడమే కాదు సానుకూల సందేశాన్ని ఇస్తుంది.

మెగాస్టార్ మరియు నటసింహం కలిసి ఒకే వేదికను పంచుకుంటే.. బాక్సాఫీస్ క్లాష్ చుట్టూ ఉన్న ప్రతికూలత కూడా తగ్గిపోతుంది. ఇద్దరు సీనియర్ హీరోల ఫ్యాన్స్ ఒకరి సినిమాలు మరొకరు ఆదరించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా రెండు చిత్రాలూ టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ రాబడతాయి. మరి మేకర్స్ కోసం మరియు రెండు చిత్రాలకు ఉత్తమ ప్రయోజనం చేకూర్చడానికి ఆ దిశగా ఆలోచన చేస్తారేమో చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.