Begin typing your search above and press return to search.

ఉప్పెన హీరో.. త్రివిక్రమ్‌ పర్యవేక్షణ

By:  Tupaki Desk   |   21 Jun 2022 6:35 AM GMT
ఉప్పెన హీరో.. త్రివిక్రమ్‌ పర్యవేక్షణ
X
మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన పలువురు హీరోల్లో వైష్ణవ్‌ తేజ్ ఒకడు. ఉప్పెన సినిమా తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన వైష్ణవ్‌ తేజ్ మొదటి సినిమా తోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుని మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులు అంతా కూడా అభిమానిస్తున్నారు. కొండపొలం సినిమాతో నటుడిగా మెప్పించిన వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం రంగరంగ వైభవంగా సినిమాలో నటిస్తున్నాడు.

వైష్ణవ్‌ తేజ్‌ నాల్గవ సినిమా పట్టాలెక్కబోతుంది. తాజాగా శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్‌ తేజ్ హీరోగా ఒక సినిమా రూపొందబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ భార్య సాయి సౌజన్య అధికారికంగా నిర్మాతగా మారబోతున్నారు.

ఈ సినిమా కు స్క్రిప్ట్‌ వర్క్ లో త్రివిక్రమ్‌ సహకారం చాలా వరకు ఉందని తెలుస్తోంది. మహేష్ బాబు సినిమా షూటింగ్‌ ప్రారంభంకు ఇంకా సమయం ఉన్న కారణంగా ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ సినిమా యొక్క ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ ను పర్యవేక్షిస్తున్నారని సమాచారం అందుతోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

త్రివిక్రమ్‌ భార్య సాయి సౌజన్య ఎక్కువగా వార్తల్లో నిలిచిందే లేదు. అసలు ఇప్పటి వరకు ఆమెను చూసిందే చాలా తక్కువ. ఈ సినిమాతో నిర్మాతగా మారబోతున్న సాయి సౌజన్య గారు ముందు ముందు సోలో నిర్మాతగా కూడా మారే అవకాశాలు ఉన్నాయి.

సితార ఎంటర్ టైన్మెంట్‌ అధినేత అయిన రాధాకృష్ణ మరియు నాగవంశీలు సాయి సౌజన్య కు బంధువులు. ఆ కారణంగా కొన్నాళ్లుగా త్రివిక్రమ్‌ పూర్తిగా రాధాకృష్ణ బ్యానర్‌ లోనే సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పుడు స్వయంగా త్రివిక్రమ్‌ భార్య సాయి సౌజన్య సొంత బ్యానర్‌ ను ఏర్పాటు చేయబోతున్నారు. వైష్ణవ్‌ తేజ్ సినిమా తో ఆమె ఇండస్ట్రీలో అధికారికంగా అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఈ సినిమా పై ఉండే అవకాశం ఉంది.