Begin typing your search above and press return to search.

బాల‌య్య సినిమా టైటిల్‌ ను ఛానెల్ ప్ర‌క‌టించ‌డ‌మా?

By:  Tupaki Desk   |   16 Oct 2019 5:29 AM GMT
బాల‌య్య సినిమా టైటిల్‌ ను ఛానెల్ ప్ర‌క‌టించ‌డ‌మా?
X
నాగచైతన్య - రష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన ‘అదే నువ్వు అదే నేను’ అనే సినిమా శాటిలైట్ హక్కుల్ని జెమిని టీవీ సొంతం చేసుకుందంటూ ఈ మ‌ధ్య ఆ ఛానెల్ ట్విట్ట‌ర్ అకౌంట్లో ఒక పోస్ట్ ప్ర‌త్య‌క్షం కావ‌డం అంద‌రికీ ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించిన సంగ‌తి తెలిసిందే. అసలు చైతూతో కలిసి రష్మిక ఎప్పుడు సినిమా కమిటైందో కూడా తెలియదు. అలాంటిది టైటిల్ కూడా ప్ర‌క‌టిస్తూ శాటిలైట్ హ‌క్కుల్ని తాము సొంతం చేసుకున్న‌ట్లు జెమిని టీవీ ట్విట్ట‌ర్ పేజీలో పేర్కొని షాకిచ్చారు. ఆ త‌ర్వాత దాని మీద ఏ అప్ డేట్ లేదు. ఇప్పుడేమో నంద‌మూరి బాల‌కృష్ణ కొత్త సినిమా శాటిలైట్ హ‌క్కులు త‌మ సొంత‌మైన‌ట్లు అదే పేజీలో అప్ డేట్ ఇచ్చారు.

ఈ చిత్రానికి రూల‌ర్ అనే టైటిల్ ఖ‌రారైన‌ట్లు కూడా పేర్కొన్నారు. బాల‌య్య‌-సోనాల్ చౌహాన్ జంట‌గా ఈ మ‌ధ్యే చిత్ర బృందం రిలీజ్ చేసిన ఫొటోను కూడా షేర్ చేశారు. ఇది టిక్ మార్క్ ఉన్న జెమిని ఛానెల్ ట్విట్ట‌ర్ పేజీ పోస్టే కావ‌డంతో చిత్ర యూనిట్ కంటే ముందు వీళ్లు టైటిల్ ప్ర‌క‌టించ‌డ‌మేంటా అని జ‌నాలు షాక‌వుతున్నారు. ఈ సినిమాకు ముందు రూల‌ర్ అనే టైటిలే ప్ర‌చారంలోకి వ‌చ్చినా.. ఈ మ‌ధ్య‌ ‘క్రాంతి’ అనే టైటిల్‌ తో పాటు ‘జడ్జిమెంట్’ - ‘డిపార్ట్‌మెంట్’ అనే టైటిల్స్ కూడా పరిశీలిస్తున్న‌ట్లు వార్త‌లొచ్చాయి. ఇంత‌లో జెమిని ట్విట్ట‌ర్ పేజీలో రూల‌ర్ అనే టైటిల్‌ తో శాటిలైట్ హ‌క్కుల గురించి అప్ డేట్ ఇచ్చారు. మ‌రి ఇదెంత వ‌ర‌కు నిజ‌మో చూడాలి. కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్ - వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 20న విడుదల చేయాలనే ఆలోచ‌న‌లో ఉన్నారు.