Begin typing your search above and press return to search.

'భీమ్లా నాయక్' కు త్రివిక్రమ్ కీలక సవరణలు..?

By:  Tupaki Desk   |   13 Jan 2022 8:30 AM GMT
భీమ్లా నాయక్ కు త్రివిక్రమ్ కీలక సవరణలు..?
X
పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''భీమ్లా నాయక్''. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి చివరి వారంలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న 'భీమ్లా నాయక్' సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమా ఎడిటింగ్ పార్ట్ ను త్రివిక్రమ్ శ్రీనివాస్ పర్యవేక్షిస్తున్నట్లు టాక్. మొదటి నుంచీ ఈ చిత్రానికి అన్నీ తానై దగ్గరుండి చూసుకుంటున్న అగ్ర దర్శకుడు.. ఇప్పుడు ఎడిట్ లో కీలక సవరణలు సూచిస్తున్నారట.

మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రానికి తెలుగు రీమేక్ గా ''భీమ్లానాయక్'' తెరకెక్కుతోంది. ఇద్దరు సమజ్జీవుల మధ్య అహం - ఆత్మాభిమానం వల్ల వారి జీవితాల్లో ఏర్పడిన పరిస్థితులను ఈ సినిమాలో చూపించబోతున్నారు. పవన్ కల్యాణ్ ఇమేజ్ మన నేటివిటీ - సెన్సిబిలిటీలను దృష్టిలో పెట్టుకొని తెలుగులో అనేక మార్పులు చేర్పులు చేశారు త్రివిక్రమ్. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది.

''భీమ్లానాయక్'' చిత్రంలో పవన్ కళ్యాణ్ పోలీసాఫీసర్ గా కనిపిస్తుండగా.. ఆయనకు జోడీగా నిత్యా మీనన్ నటిస్తోంది. అలానే రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేస్తోంది. రావు రమేష్ - మురళీశర్మ - సముద్ర ఖని - రఘుబాబు - నర్రా శ్రీను - కాదంబరి కిరణ్ - చిట్టి - పమ్మి సాయి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. అన్నీ అనుకున్నట్లు జరిగి పరిస్థితులు అనుకూలిస్తే.. 'భీమ్లానాయక్' సినిమా వచ్చే నెల 25న విడుదల అవుతుంది.