Begin typing your search above and press return to search.

అత్యధిక టీఆర్పీ సాధించిన టాప్ 10 తెలుగు సినిమాలు..!

By:  Tupaki Desk   |   7 May 2021 2:30 AM GMT
అత్యధిక టీఆర్పీ సాధించిన టాప్ 10 తెలుగు సినిమాలు..!
X
వెండితెరపై విజయవంతమైన సినిమాలు చాలా వరకు బుల్లితెరపై కూడా సత్తా చాటుతుంటాయి. కొన్నిసార్లు థియేటర్స్ లో ప్రభావం చూపించని సినిమాలు కూడా స్మాల్ స్క్రీన్ పై విశేష ఆదరణ తెచ్చుకొని మంచి టీఆర్పీ సాధిస్తుంటాయి. టాలీవుడ్ లో ఇప్పటి వరకు బుల్లితెర ప్రేక్షకులను అలరించిన అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ అందుకున్న సినిమాల జాబితా ఒక్కసారి పరిశీలిద్దాం!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అల వైకుంఠపురంలో' సినిమా సూపర్ హిట్ అవడమే కాకుండా టీవీల్లో కూడా విశేష స్పందన తెచ్చుకుంది. టాలీవుడ్ చరిత్రలోనే అత్యధికంగా 29.4 టీఆర్పీ నమోదు చేసి రికార్డ్ సృష్టించింది. అయితే ఈ సినిమా రెండోసారి ప్రదర్శించినప్పుడు అతి తక్కువ టీఆర్పీ తెచ్చుకోవడం గమనార్హం.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు' బుల్లితెర పై కూడా సత్తా చాటింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జెమినీ టీవీలో ప్రదర్శించబడి 23.4 టీఆర్పీ రేటింగ్ పాయింట్స్ సాధించి రెండో స్థానంలో నిలిచింది. అయితే రెండోసారి మూడో సారి టెలికాస్ట్ లో కూడా హయ్యెస్ట్ టీఆర్పీని రాబట్టి సంచలనం సృష్టించింది.

యంగ్ రెబల్ స్టార్ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ 'బాహుబలి 2' 22.7 టీఆర్పీ రేటింగ్ తో మూడో ప్లేస్ లో నిలిచింది. మహేష్ బాబు - కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'శ్రీమంతుడు' 22.54 టీఆర్పీ తో నాలుగో స్థానంలో ఉంది. అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ తీసిన 'డీజే-దువ్వాడ జగన్నాథం' సినిమా 21.7 రేటింగ్ తో తర్వాతి ప్లేస్ లో నిలిచింది.

రాజమౌళి - ప్రభాస్ కాంబోలో తెరకెక్కిన 'బాహుబలి' సినిమా 21.54 రేటింగ్ తో ఆరో ప్లేస్ లో ఉంది. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఫిదా' 21.31 టీఆర్పీ రేటింగ్ సాధించి ఏడో స్థానం దక్కించుకుంది. విజయ్ దేవరకొండ - పరశురామ్ కాంబినేషన్లో వచ్చిన 'గీత గోవిందం' సినిమా 20.80 రేటింగ్ తో తర్వాత స్థానంలో ఉంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన 'జనతా గ్యారేజ్' సినిమా 20.69 రేటింగ్ తో హవా చూపించింది. అలానే కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ రూపొందించిన సావిత్రి బయోపిక్ 'మహానటి' కి 20.21 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన బ్లాక్ బస్టర్ 'రంగస్థలం' మూవీ 19.5 టీఆర్పీ తెచ్చుకుంది. మరి రాబోయే రోజుల్లో బుల్లితెర పై మంచి టీఆర్పీ తెచ్చుకొని వీటి ప్లేస్ లోకి ఏయే సినిమాలు వస్తాయో చూడాలి.