Begin typing your search above and press return to search.

టిక్కెట్టు ధ‌ర తేల‌క‌పోతే ఓటీటీనే దిక్కా?

By:  Tupaki Desk   |   9 Sept 2021 7:00 PM IST
టిక్కెట్టు ధ‌ర తేల‌క‌పోతే ఓటీటీనే దిక్కా?
X
తెలుగు సినీప‌రిశ్ర‌మ‌ను ర‌క‌ర‌కాల స‌మస్య‌లు వెంటాడుతున్నాయి. క‌రోనా మ‌హ‌మ్మారీ అనిశ్చితి మ‌రో అద‌న‌పు స‌మ‌స్య మాత్ర‌మే.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో థియేట‌ర్ వ్య‌వ‌స్థ‌పైనా అనిశ్చితి కొన‌సాగుతోంది. థియేట‌ర్లు తెరుచుకున్నా బొమ్మ ప‌డ‌ని ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ఓటీటీ క‌ష్ట‌కాలంలో ఆదుకున్నా.. అదే ఓటీటీ ఇప్పుడు నిర్మాత‌ల‌కు-ఎగ్జిబిట‌ర్ల మ‌ధ్య‌ కాక‌లు రేపింది. దీనితో తోడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప‌రిస్థితిలు ఇంకా భిన్నంగా క‌నిపిస్తున్నాయి. జీవోతో స‌వ‌రించిన త‌ర్వాత ప‌రిశ్ర‌మ‌ ఎంత‌గా అభ్య‌ర్థించినా టిక్కెట్ రేట్లు పెంచుకోవ‌డానికి ఇక్క‌డి ప్ర‌భుత్వం అనుమతివ్వ‌లేదు. ప్ర‌భుత్వ అధికారులు-నిర్మాత‌ల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగినా అవి సంతృప్తిక‌రంగా లేవు. మ‌ళ్లీ ప్ర‌భుత్వం చ‌ర్చ‌ల‌కు పిలుస్తుంద‌ని ఆశిస్తున్నా. ఇంకా అది జ‌ర‌గ‌లేదు. ప్ర‌భుత్వాధీశులు త‌మ‌ ప‌ట్టుద‌లను వీడ‌లేం అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారని విమ‌ర్శ‌లొస్తున్నాయి.

ఇదిగో మీటింగ్..అదిగో మీటింగ్ అంటూ మీడియా క‌థ‌నాలు త‌ప్ప స‌మావేశం ఎప్పుడు జ‌రుగుతుందో కూడా క్లారిటీ లేదు. 50 శాతం ఆక్యుపెన్సీ న‌డుమ.. త‌గ్గ‌ని ధ‌ర‌ల నేప‌థ్యంలో ధైర్యం చేసి సినిమా రిలీజ్ చేసినా న‌ష్టాలు త‌ప్ప‌ రూపాయి లాభం ఉండ‌ద‌ని ఎగ్జిబిట‌ర్లు భావిస్తున్నారు. ఇలా ఎన్నో ర‌కాల స‌మ‌స్య‌ల న‌డుమ ఏపీ థియేట‌ర్ వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తంగా ఉంది. ఇంకా ఎంత కాలం ఎదురు చూడాలో కూడా అర్థం కాని ప‌రిస్థితులు. మ‌రోవైపు వ‌చ్చే నెల నుంచి ద‌స‌రా ఉత్స‌వాలు ప్రారంభమ‌వుతాయి. ఈలోపు క్లారిటీ రాక‌పోతే సినిమాలు పూర్తిస్థాయిలో ఓటీటీకి వెళ్లిపోయే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అదే గ‌నుక జ‌రిగితే ఎగ్జిబిట‌ర్లు అంతా రోడ్డున ప‌డాల్సిందేన‌ని మీడియా క‌థ‌నాలు వేడెక్కిస్తున్నాయి. ఇప్ప‌టికే అగ్ర హీరో వెంక‌టేష్ న‌టించిన `నార‌ప్ప` ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ నేప‌థ్యంలో నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన `ట‌క్ జ‌గ‌దీష్` కూడా ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ఇప్పుడున్న ప‌రిస్థితులకు గ‌నుక వీలైనంత త్వ‌ర‌గా ప‌రిష్కారం దొర‌క‌క‌పోతే చాలా సినిమాలు ఓటీటీ బాట‌ప‌ట్టే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

డి.సురేష్ బాబు బాట‌లో అగ్ర నిర్మాత‌లు?

ప్ర‌స్తుత క్రైసిస్ నేప‌థ్యంలో ఏపీలో టిక్కెట్టు స‌మ‌స్య వ‌ల్ల ఇప్ప‌టికే ద‌గ్గుబాటి సురేష్ బాబు లాంటి అగ్ర నిర్మాత తీవ్ర అసంతృప్తిగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఏపీలో టిక్కెట్టు తేలే వ్య‌వ‌హారం కాద‌ని గ్ర‌హించిన ఆయన ఆ అక్క‌సుతోనే నార‌ప్ప లాంటి పెద్ద సినిమాని ఓటీటీలో రిలీజ్ చేశారు. ఆ కాంపౌండ్ నుంచి దృశ్యం 2- విరాట‌ప‌ర్వం కూడా ఓటీటీకే ప్రాధాన్య‌త‌నిస్తాయ‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

అయితే ఆయ‌న బాట‌లోనే ఇత‌ర అగ్ర నిర్మాత‌లు కూడా ఆలోచిస్తే టాలీవుడ్ ప‌రిస్థితేమిటి.. ఎగ్జిబిష‌న్ రంగం స‌న్నివేశం ఎలా ఉంటుంది? అంటే ఊహించ‌లేం. థియేట‌ర్లు క‌ళ్యాణ మంట‌పాలుగా.. ఫంక్ష‌న్ హాల్స్ గా మారే స‌న్నివేశం మ‌రోసారి రిపీట‌వ్వ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంద‌ని విమ‌ర్శ‌లొస్తున్నాయి.

ఓటీటీ రిలీజ్ విష‌యంలో ఎగ్జిబిట‌ర్లు సంతృప్తిగా లేరు.. నిర్మాత‌ల్ని బ్యాన్ చేస్తామ‌న్నారు? అంటూ కొన్ని వ్యాఖ్య‌లు చేసారు కూడా. ఇటీవ‌ల ట‌క్ జ‌గ‌దీష్ ఓటీటీకి అంగీక‌రించిన నానీకి ఈ సెగ త‌ప్ప‌లేదు. ``థియేట్రిక‌ల్ రిలీజ్ కి వ్య‌తిరేకిని కాదు. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డిన త‌ర్వాత థియేట‌ర్లోనే సినిమాల్ని రిలీజ్ చేస్తాం. అలాగే న‌న్ను ఎగ్జిబిట‌ర్లు బ్యాన్ చేసే అవ‌కాశం ఇవ్వ‌ను. నిజంగా ఆ ప‌రిస్థితి వ‌స్తే నాకు నేనుగానే త‌ప్పుకుంటాను`` అని నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు.

నాని చేసిన ఈ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. ఏడాదిన్న‌ర క్రితం వ‌ర‌కూ సినిమాల‌న్నీ థియేట‌ర్లోనే రిలీజ్ అయ్యేవి. క‌రోనా రాక‌తోనే నిర్మాత‌లు ఓటీటీ బాట ప‌ట్టారు. ప‌రిస్థితులు బాగుంటే థియేట‌ర్లోనే రిలీజ్ చేస్తామ‌ని నిర్మాత‌లు కూడా వివ‌ర‌ణ ఇచ్చారు. అలాగే సినిమా రిలీజ్ అనేది నిర్మాత ఇష్ట ప్ర‌కారం జ‌రుగుతుంది. తెలంగాణ నిర్మాత‌ల సంఘం.. నిర్మాత‌ల‌ గిల్డ్ కూడా నాని వ్యాఖ్య‌ల్ని స‌మ‌ర్ధించిన సంగ‌తి తెలిసిందే. వీట‌న్నిటినీ మించి తొలిగా ఏపీలో టిక్కెట్టు ధ‌ర‌ల వ్య‌వ‌హారం తేలాల్సి ఉంది. దీనిపై సీఎంతో భేటీ ఎప్పుడు అన్న‌దానిపైనా క్లారిటీ రావాలి. ఇలాంటి ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో డి.సురేష్ బాబు స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు స్వేచ్ఛ‌గా త‌మ సినిమాల్ని ఓటీటీల్లో రిలీజ్ చేసుకునే ప్లాన్ లో నే ఉన్నారు. ఇది ఏ ఒక్క‌రి స‌మ‌స్య‌నో కాదు.. ప‌రిశ్ర‌మ స‌మ‌స్య కాబ‌ట్టి దీనికి స‌రైన ప‌రిష్కారం దొర‌కాల్సి ఉంది. ప‌రిష్కారం దొర‌క‌నంత కాలం ఓటీటీలే దిక్కు.