Begin typing your search above and press return to search.

ఇండియన్‌ సినిమా మొత్తం చూపు ఖిలాడిపైనే!

By:  Tupaki Desk   |   21 Oct 2021 4:05 AM GMT
ఇండియన్‌ సినిమా మొత్తం చూపు ఖిలాడిపైనే!
X
కరోనా కారణంగా గత ఏడాది మార్చి నుండి ఇప్పటి వరకు బాలీవుడ్‌ లో సినిమాలే విడుదల అవ్వడం లేదు. మద్యలో రెండు మూడు సినిమాలు వచ్చినా కూడా వాటి కలెక్షన్స్ పరిస్థితి ఎంత దారుణమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు లేదు. ఏడాదిన్నరకు పైగా బాలీవుడ్‌ లో థియేటర్లు మూత పడటంతో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కరోనా కారణంగా పెద్ద హీరోల సినిమాలన్నీ కూడా విడుదల ఆగిపోయాయి. ఒకటి రెండు ఓటీటీ ల ద్వారా వచ్చినా కూడా మెజార్టీ సినిమాలు థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్ అయితే విడుదల చేయాలని భావిస్తున్నారు. సౌత్‌ లో అయినా కరోనా తర్వాత పెద్ద సినిమాలు వచ్చాయి.. వందల కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. కాని హిందీ సినిమా పరిశ్రమ మాత్రం ఇంకా పెద్ద సినిమాలు విడుదల కాలేదు.

ఇండియన్‌ సినిమా మొత్తం కూడా ఎప్పుడెప్పుడు బాలీవుడ్‌ నుండి పెద్ద సినిమాలు వస్తాయా అంటూ ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు మహారాష్ట్రలో ఈ వారం నుండి థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్ కు అనుమతులు వచ్చాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా పరిస్థితులు నార్మల్‌ అవుతున్నాయి. ఈ సమయంలో దీపావళి కానుకగా నవంబర్‌ 5న బాలీవుడ్‌ అక్షయ్‌ కుమార్‌ సూర్యవంశీ సినిమా విడుదల కాబోతుంది. సినిమా చిత్రీకరణ ప్రారంభం అయినప్పటి నుండే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అక్షయ్‌ కుమార్‌ సినిమా అంటే మినిమం వంద కోట్లు అనేది అందరికి తెల్సిందే. అక్షయ్‌ కుమార్‌ సూర్యవంశీతో బాలీవుడ్‌ పునః ప్రారంభంకు తెర తీయబోతున్నాడు. గత ఏడాది కరోనా తర్వాత విడుదల కాబోతున్న మొదటి పెద్ద సినిమా ఇదే అవ్వడం వల్ల ఇండియన్‌ సినీ ప్రేమికులు అంతా కూడా ఈ సినిమా వైపు ఆసక్తిగా చూస్తున్నారు.

దేశ వ్యాప్తంగా సూర్యవంశీ సినిమాను 2500 థియేటర్ల కంటే ఎక్కువ సంఖ్యలో విడుదల చేయాలని భావిస్తున్నారు. విదేశాల్లో కూడా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. సినిమా లో అక్షయ్‌ కుమార్‌ పోలీస్ ఆఫీసర్ గా కనిపించడంతో పాటు.. సినిమా టీజర్ మరియు ట్రైలర్‌ లు సినిమాపై అంచనాలు పెంచేసే విధంగా ఉంది. రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను ఎన్నో సినిమాలతో అందుకున్న అక్షయ్‌ కుమార్‌ చాలా కాలం తర్వాత బాలీవుడ్‌ కు వంద కోట్లను ఇవ్వబోతున్నాడా అనేది చూడాలి. ఈ సినిమా కనుక వంద కోట్లను మించి వసూళ్లు చేస్తే బాలీవుడ్‌ లో మళ్లీ వరుస సినిమాల జోరు మొదలు అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మన సౌత్ సినిమాలు కూడా అక్కడ విడుదల అవ్వాల్సి ఉంది. కనుక మన వాళ్లు కూడా సూర్యవంశీ సినిమా ఫలితంపై ఆసక్తిని కనబర్చుతున్నారు.