Begin typing your search above and press return to search.

భ‌విష్య‌త్ ఓటీటీదే.. ఇంకా ఎందుకీ వెయిటింగ్?

By:  Tupaki Desk   |   15 April 2020 10:02 AM IST
భ‌విష్య‌త్ ఓటీటీదే.. ఇంకా ఎందుకీ వెయిటింగ్?
X
విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ అంత‌టి వాడే త‌న సినిమాని థియేట్రిక‌ల్ రిలీజ్ కాకుండా డైరెక్ట్ టు హోమ్(డీటీహెచ్)లోకి తెచ్చేయాల‌నుకున్నాడు. అంటే త‌న సినిమాని జ‌నం ఆద‌రించాలే కానీ వేదిక ఏదైతే ఏమిటి? అనేది ఆయ‌న ఆలోచ‌న‌. క‌మ‌ల్ అడ్వాన్స్ డ్ మైండ్ సెట్ కి నిద‌ర్శ‌నం. బాగా బ్రాడ్ గా ఆలోచించే వాళ్లే ఇంత‌టి సాహసం చేయ‌గ‌ల‌రు. థియేట్రిక‌ల్ రిలీజ్ లు రికార్డులు ఫ్యూచ‌ర్ అంటూ నానా ర‌కాలుగా ఆలోచిస్తే ఆ ప్ర‌యోగం స‌ఫ‌లం కాదు. అయితే పంపిణీదారులు- బ‌య్య‌ర్లు- ఎగ్జిబిట‌ర్ వ్య‌వ‌స్థ స‌హా సినీ పెద్ద‌లంతా క‌మ‌ల్ హాస‌న్ ఆలోచ‌న‌తో త‌మ‌కు మునుముందు ముంచుకు వ‌చ్చే ముప్పు గురించి ఆలోచించి తీవ్రంగా క‌ల‌త‌కు గురై మోకాల‌డ్డారు కానీ.. ఈపాటికే ఆ విధానం అమల్లోనే ఉండి ఉండేది. క‌మ‌ల్ హాస‌న్ కి అండ‌గా దాస‌రి వంటి వారు కొన్నాళ్లు ఊగినా కానీ చివ‌రికి అంద‌రి ముందూ పెద్దాయ‌న కూడా త‌లొంచాల్సి వ‌చ్చింది.

ఇక‌పోతే డిజిట‌ల్ లో డీటీహెచ్ విధానం కంటే ఓటీటీ విధానం విభిన్న‌మైన‌దేం కాదు. ఈ వేదిక‌పై త‌మ సినిమాల్ని రిలీజ్ చేస్తే టీవీ వీక్ష‌కుల్లో విశేష‌మైన ఆద‌రణ ద‌క్కుతోంది. క‌రోనా విప‌త్తు వేళ ఓటీటీల‌కు చ‌క్క‌ని ఆద‌ర‌ణ పెరిగింది. మునుముందు ఇదే వేదిక‌ను ఆడియెన్ ప‌ర్మినెంట్ చేసుకునే స‌న్నివేశం క‌నిపిస్తోంది. కొవిడ్ 19 మ‌హ‌మ్మారీ ఎప్ప‌టికి అంత‌మ‌వుతుందో తెలీని స‌న్నివేశం ఉంది. అందుకే ఈ ఏడాదంతా ఓటీటీదే రాజ్యం. టీవీల‌కు అతుక్కుపోతున్న జ‌నం అమెజాన్ - నెట్ ఫ్లిక్స్ - జీ5 వంటి వాటిని ఎంపిక చేసుకుంటున్నారు. దీంతో ఓటీటీ ప్ర‌తినిధుల‌కు కొత్త సినిమాలు కొని అందివ్వాల‌న్న త‌ప‌న ఫ్లెక్సిబిలిటీ పెరిగింది. ఆ క్ర‌మంలోనే ఇప్ప‌టికే రిలీజ్ చేయ‌కుండా డైల‌మాలో ఉన్న వాటిని కొనుక్కుని ఓటీటీలో వేయాల‌న్న ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. అయితే అటు హీరోలు - ద‌ర్శ‌కుల అభ్యంత‌రాల‌తో నిర్మాత‌లు డైల‌మాలో ప‌డి పోతున్నార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. పెద్ద తెర - థియేట్రిక‌ల్ రిలీజ్ మాత్ర‌మే కావాలి ప్లీజ్! అంటూ హీరోలు బింకానికి పోతున్నార‌ట‌. అలాగే ద‌ర్శ‌కులు త‌మ ఉత్ప‌త్తిపై న‌మ్మ‌కంతో థియేట్రిక‌ల్ రిలీజ్ కి వేచి చూడాల‌ని నిర్మాత‌ల్ని పోరుతున్నార‌ట‌. కానీ ఓటీటీ కంపెనీల నుంచి వ‌చ్చిన ఆఫ‌ర్లు వ‌దులుకుంటే మొద‌టికే ముప్పు వ‌స్తుంద‌ని నిర్మాత‌లు క‌ల‌త చెందుతున్నారు. లాభ‌న‌ష్టాల మాట అటుంచితే క‌నీసం సేఫ్ అయిపోవాల‌నుకునే నిర్మాత‌లే ఎక్కువ మంది ఉన్నారు. ఆ క్ర‌మంలోనే ఓటీటీకి అమ్మాల‌నేదే వీరి ఉద్ధేశం. అయితే హీరోలు ద‌ర్శ‌కులు వెసులుబాటు క‌ల్పిస్తే ప‌ని సులువు అవుతుంది.

సీన్ చూస్తుంటే.. ఈ ఏడాది అంతా క‌రోనా భ‌యంతో జ‌నం థియేట‌ర్ల‌కు వ‌చ్చేందుకు ఇష్ట‌ప‌డే పరిస్థితి లేదు. లాక్ డౌన్ లు ఎత్తేసినా ఎవ‌రి భ‌యం వారికి ఉంటుంది. అలాంట‌ప్పుడు థియేట్రిక‌ల్ రిలీజ్ ల‌తో ఉద్ధ‌రించేది ఏం ఉంటుంది? పైగా స‌గం సీట్లు ఖాళీగా ఉంచి థియేట‌ర్ లో సినిమా ఆడిస్తుంటే మునుప‌టిలా 100 రోజులు ఆడిస్తేనే డ‌బ్బు వెన‌క్కి వ‌స్తుంది మ‌రి. ఏది బెట‌ర్ అనేది నిర్మాత‌ల‌తో క‌లిసి హీరోలు స్మార్ట్ గా ఆలోచించాల‌ని కోరుతున్నారు.