Begin typing your search above and press return to search.

ఇప్పుడైనా దర్శకనిర్మాతలు లోకల్ టాలెంటుని ఎంకరేజ్ చేస్తారా..?

By:  Tupaki Desk   |   6 April 2020 1:30 AM GMT
ఇప్పుడైనా దర్శకనిర్మాతలు లోకల్ టాలెంటుని ఎంకరేజ్ చేస్తారా..?
X
ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా అనే కంటికి కనిపించని సూక్ష్మజీవి గుప్పిట్లో ఉందని చెప్పవచ్చు. అది చెప్పిందే ప్రపంచం చేస్తుంది.. అది చెప్పిందే ప్రపంచం వింటోంది.. కరోనా ప్రభావం ఎక్కువగా పడిన రంగాల్లో సినీరంగం ఒకటి. ప్రస్తుత పరిస్థితులు చూస్తే కరోనా ఎఫెక్ట్ చిత్ర పరిశ్రమపై ఈ ఏడాది చివరి వరకు కొనసాగినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న నేపథ్యంలో సినిమా మీద ఆధారపడి జీవించే కొన్ని లక్షల కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ఇప్పటికే మల్టీప్లెక్సులు - థియేటర్లు మూసి వేయడంతో నిర్మాతలు డిస్టిబ్యూటర్స్ - థియేటర్ల ఓనర్లు భారీ నష్టాలను చవిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నిర్మాతలు కూడా విరివిగా డబ్బులు ఖర్చు చేసి సినిమాలు తీసే పరిస్థితి కనిపించడం లేదు.

ఇప్పటి నుంచి డైరెక్టర్లు - నిర్మాతలు ఆచితూచి అడుగులు వేసే అవకాశం ఉంది. వీళ్ళు ఖచ్చితంగా ఖర్చు తగ్గించుకునే మార్గాలని వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రేపు లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత బయట నుండే హీరోయిన్లను - ఆర్టిస్టులను - టెక్నీషియన్స్ ని తెచ్చుకొని పని చేయించుకుంటే వారికి ఎక్కువ మొత్తంలో ముట్టజెప్పాలి.. దీని వల్ల ఖర్చు. ముందే కరోనా వల్ల నష్టాల్లో ఉన్న మనం ఇలాంటి రిస్క్ తీసుకోవడం అవసరమా అని కొంతమంది నిర్మాతలు - దర్శకులు భావిస్తున్నారట. అదే ఇక్కడే లోకల్ వాళ్ళని ఎంకరేజ్ చేసి సినిమాల్లోకి తీసుకుంటే ఖర్చుకి ఖర్చు తగ్గుతుంది...తెలుగు ఇండస్ట్రీ కూడా బాగుపడుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

అంతేకాకుండా టాలెంట్ ఉన్న మన తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేస్తే టాలీవుడ్ కి ఇంకా మేలు చేసిన వాళ్లవుతారని కూడా చెప్తున్నారు. మన పక్క ఇండస్ట్రీ వాళ్ళు ఇప్పటికే ఇదే పద్ధతి ఫాలో అవుతూ ఉంటారు. తెలుగు - మలయాళ - కన్నడ చిత్ర పరిశ్రమలలో ఎక్కువ శాతం అక్కడి వాళ్లనే సినిమాల్లోకి తీసుకుంటూ ఉంటారు. మరి లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత అయినా మన డైరెక్టర్లు - నిర్మాతలు తెలుగు వాళ్లకి అవకాశం ఇచ్చి లోకల్ టాలెంటుని ఎంకరేజ్ చేస్తారేమో చూడాలి.