Begin typing your search above and press return to search.

తమిళ స్టార్‌ హీరోల సినిమాలను అడ్డుకున్న తెలుగు నిర్మాతలు

By:  Tupaki Desk   |   13 May 2019 1:47 PM GMT
తమిళ స్టార్‌ హీరోల సినిమాలను అడ్డుకున్న తెలుగు నిర్మాతలు
X
తమిళ స్టార్‌ హీరోలు అయిన ధనుష్‌ మరియు విజయ్‌ సేతుపతిలు విడి విడిగా నటించిన 'ఎన్నై నోకి పాయిమ్‌' మరియు 'సింధుబాద్‌' చిత్రాలను తెలుగు ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ఆర్కా మీడియా నిర్మాతలు అడ్డుకుంటున్నారు. ఈ రెండు సినిమాలను నిర్మించిన నిర్మాతలతో ఆర్కా మీడియా వారికి ఆర్థిక పరమైన గొడవలు జరుగుతున్నాయి. బాహుబలి 2 సమయంలోని చెల్లింపులు ఇంకా చెల్లించని కారణంగా ఆ రెండు సినిమాలను ఆర్కా మీడియా విడుదల కాకుండా అడ్డుకుంటుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే... ధనుష్‌ హీరోగా ఎన్నై నోకి పాయిమ్‌ చిత్రాన్ని పి మధన్‌ నిర్మించాడు. అలాగే విజయ్‌ సేతుపతితో కె ప్రొడక్షన్స్‌ అధినేత ఎఎన్‌ రాజరాజన్‌ సింధుబాద్‌ అనే చిత్రాన్ని నిర్మించాడు. వీరిద్దరు కూడా బాహుబలి 2 చిత్ర నిర్మాతలు అయిన శోభు యార్లగడ్డ మరియు ప్రసాద్‌ దేవినేనిలకు డబ్బు చెల్లించాల్సి ఉంది. అయితే వీరిద్దరు తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదని - తమకు చెల్లించాల్సిన డబ్బు ఇచ్చిన తర్వాతే ఈ రెండు చిత్రాలు విడుదల చేసుకునేలా స్టే ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టును ఆర్కా మీడియా నిర్మాతలు ఆశ్రయించారు.

ఆర్కా మీడియా వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు తాజాగా ఆ రెండు సినిమాల విడుదలకు స్టే ఇచ్చింది. తదుపరి విచారణ వరకు సినిమాల విడుదల చేయవద్దని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆర్కా మీడియా వారితో ఉన్న ఆర్ధిక పరమైన ఇష్యూను సెటిల్‌ చేసుకుంటే తప్ప ఆ రెండు సినిమాలు ఇప్పుడు విడుదల అయ్యే పరిస్థితి లేదు. తమిళ స్టార్‌ హీరోల సినిమాల విడుదలకు ఆర్కా మీడియా అడ్డు పడుతుండటంతో అక్కడ ఆ హీరోల అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరో వైపు చిత్రాల నిర్మాతలు ఆర్కా మీడియాతో చర్చలకు సిద్దం అవుతున్నట్లుగా తమిళ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి.