Begin typing your search above and press return to search.

యూరప్‌ కు వెళ్లే ముగించాలనుకుంటున్న నితిన్‌ టీం

By:  Tupaki Desk   |   24 July 2020 3:35 PM GMT
యూరప్‌ కు వెళ్లే ముగించాలనుకుంటున్న నితిన్‌ టీం
X
ఈ ఏడాది భీష్మ చిత్రంతో సక్సెస్‌ దక్కించుకున్న నితిన్‌ జులైలో ‘రంగ్‌ దే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నాడు. కాని కరోనా కారణంగా రంగ్‌ దే చిత్రం షూటింగ్‌ ఇంకా పూర్తి చేయలేక పోయారు. ఇప్పటి వరకు సినిమా దాదాపుగా 70 శాతం వరకు పూర్తి అయ్యిందట. మిగిలిన బ్యాలన్స్‌ షూట్‌ యూరప్‌ లో చేయాలనుకున్నారట. కాని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యూరప్‌ వెళ్లడం సాధ్యం కాదని ఇండియాలోనే పూర్తి చేయాలని అనుకున్నారు. కాని పరిస్థితులు మెల్ల మెల్లగా కుదుట పడుతున్నాయి. ముఖ్యంగా యూరప్‌ లో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లుగానే అనిపిస్తున్న కారణంగా అక్కడకు వెళ్లి షూటింగ్‌ చేసుకుని రావాలనే నిర్ణయానికి వచ్చారట.

సితార ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ బ్యానర్‌ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘రంగ్‌ దే’ చిత్రంలో నితిన్‌ కు జోడీగా కీర్తి సురేష్‌ నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ ను సెప్టెంబర్‌ లో యూరప్‌ వెళ్లి పూర్తి చేసుకుని రావాలనుకుంటున్నారు. చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రత్యేక విమానంలో యూరప్‌ వెళ్లబోతున్నారట. దాదాపు నెల రోజుల పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు అంతా కూడా అక్కడే ఉండి చిత్రీకరణ జరుపబోతున్నారు. యూరప్‌ షెడ్యూల్‌ తో సినిమా దాదాపుగా పూర్తి అవ్వనుంది.

కరోనా ఉదృతి తగ్గి సెప్టెంబర్‌ లో థియేటర్లు పున: ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు నమ్ముతున్నారు. అందుకే ఈ చిత్రాన్ని దసరా కానుకగా తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు. ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయాలనే పట్టుదలతో నిర్మాతలు ఉన్నారు. అందుకే ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా యూరప్‌ వెళ్లాలని యూనిట్‌ సభ్యులు నిర్ణయించుకున్నారట.