Begin typing your search above and press return to search.
`బాహుబలి`కి మరో అరుదైన అవార్డు!
By: Tupaki Desk | 1 Dec 2017 8:54 AM GMTప్రపంచవ్యాప్తంగా బాహుబలి చిత్రానికి మంచి గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమా స్టామినాను చాటిచెప్పిన ఈ సినిమా పలు రికార్డులను తిరగరాసి....మరెన్నో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఇప్పటికే ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి అనేక అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే. తాజాగా, జక్కన్న చెక్కిన ఈ అద్భుత కళాఖండానికి మరో అరుదైన గౌరవం దక్కింది. సీఎన్ ఎన్ ఐబీఎన్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2017గా `బాహుబలి` ఎంపికైంది. నిన్న రాత్రి జరిగిన ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా నటి రమ్యకృష్ణ - నిర్మాత యార్లగడ్డ శోభులు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్నారు.
ఈ అవార్డుల కార్యక్రమానికి లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్, కోహ్లీతో పాటు పలువురు రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. 2015లో ఈ ప్రతిష్టాత్మక అవార్డును దర్శకు ధీరుడు రాజమౌళి అందుకున్నారు. అయితే, ఈ ఏడాది బాహుబలి నుంచి ఎవరో ఒకరికి ఈ అవార్డు వస్తుందని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా ఈ మెగా ప్రాజెక్టు కోసం పని చేసిన వారందరికీ ఈ అవార్డును అందించడం విశేషం. బాహుబలిలో నటించిన అనుభవం తన జీవితాంతం గుర్తుంటుందని నటి రమ్యకృష్ణ అన్నారు. అవార్డును అందుకున్న శోభు యార్లగడ్డ .....'బాహుబలి-3` పై క్లారిటీ ఇచ్చేశారు. వచ్చే ఏడాదో - ఆ మరుసటి ఏడాదో ఆ సినిమా రాబోతోందని ఎవరూ భావించవద్దని చెప్పారు. అయితే, భవిష్యత్తులో బాహుబలి-3 ని ఏదో ఒక సమయంలో రూపొందించే అవకాశముందని అభిప్రాయపడ్డారు. దీంతో, వచ్చే రెండేళ్లలో బాహుబలి-2 కు సీక్వెల్ ఉంటుందని వస్తున్న ఊహాగానాలకు తెరపడినట్లయింది.