Begin typing your search above and press return to search.

రైతులకు తాప్సీ - సాక్షి మద్దతు.. హీరోలపై ఫైర్.. రెండుగా చీలిన‌ బాలీవుడ్!

By:  Tupaki Desk   |   5 Feb 2021 2:00 PM IST
రైతులకు తాప్సీ - సాక్షి మద్దతు.. హీరోలపై ఫైర్.. రెండుగా చీలిన‌ బాలీవుడ్!
X
మోడీ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాలంటూ 70 రోజులకు పైగా రైతులు ఆందోళ‌న చేస్తున్నారు. ప‌లు మార్లు చర్చలు జ‌రిపిన ప్ర‌భుత్వం.. స‌మ‌స్య‌కు ప‌రిష్కారాన్ని క‌నుగొన లేక‌పోయింది. ఈ క్ర‌మంలోనే రైతుల ఆందోళ‌న ప్ర‌పంచం మొత్తానికి పాకింది. రైతుల‌కు మ‌ద్ద‌తుగా ప‌లువురు అంతర్జాతీయ సెలబ్రిటీలు ట్వీట్లు చేస్తున్నారు. అయితే.. బాలీవుడ్ న‌టుల్లో కొంద‌రు ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ప‌లికిన విష‌యం కూడా తెలిసిందే. తాజాగా స్పందించిన హీరోయిన్లు తాప్సీ, సాక్షి సిన్హా మాత్రం రైతుల ప‌క్షాన మాట్లాడటం విశేషం.

పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ నుండి వేలాది మంది రైతులు ఈ ఆందోళ‌నలో పాల్గొంటున్నారు. నవంబర్ చివరి వారం నుంచి మొద‌లైన ఈ ఆందోళ‌న‌లు ఇంకా కొన‌స‌గుతూనే ఉన్నాయి. మోడీ స‌ర్కారు తెచ్చిన ఈ మూడు కొత్త వ్యవసాయ చట్టాలు అమ‌లైతే.. త‌మ జీవితాలు కార్పొరేట్ల దయపై ఆధార‌ప‌డాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంద‌ని రైతులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో పాప్ సింగ‌ర్ రిహ‌న్నా చేసిన ట్వీట్ ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ‘మనం రైతుల ఆందోళన గురించి ఎందుకు మాట్లాడకూడదు?’ అంటూ ఆమె చేసిన ట్వీట్ ట్విట్టర్ ను కుదిపేసింది. బాలీవుడ్ సినిమా నటులు, పలువురు క్రికెటర్లు ఇది అంతర్గత విషయం, మేమే పరిష్కరించుకుంటా.. ఇతరుల జోక్యం అవసరం లేదు అంటూ ట్వీట్లు చేశారు. అక్ష‌య్ కుమార్‌, అజ‌య్ దేవ్‌గ‌న్‌, కంగ‌నా.. క్రికెట‌ర్లు స‌చిన్‌, కోహ్లీ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా మాట్లాడారు.

అయితే.. వీరు ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా చేసిన ట్వీట్లపై మండిపడింది నటి తాప్సీ పన్ను. రైతుల కష్టాలు తెలియకుండా అక్షయ్, అజయ్ దేవ్‌గన్‌లు ప్రభుత్వానికి మద్దతు తెలపడం సరికాదని ఆగ్ర‌హం వ్య‌క్తంచేసింది. నెల‌ల త‌ర‌బ‌డి రైతులు రోడ్లెక్కి ఆందోళ‌న చేస్తుంటే.. వ్యవస్థను బలోపేతం చేయడం వ‌దిలేసి, ప్రభుత్వమే తప్పుడు ప్రచారానికి దిగ‌డం సరికాదని హితవు పలికింది. ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్న స్టార్ల తీరు స‌రికాద‌ని వ్యాఖ్యానించింది తాప్సీ.

‘‘ఒక్క ట్వీట్ మీ సమగ్రతను దెబ్బతీస్తే.. ఒక్క ట్వీట్ మీ నమ్మకాన్ని దెబ్బతీస్తే.. ఒక్క ప్రదర్శన మీ మత విశ్వాసాలను దెబ్బతీస్తే.. ఈ అంశాలను లేదా వ్యవస్థలను బలోపేతం చేసే బాధ్యత తీసుకోవాలి. అంతేగానీ.. ఇతరులు చేస్తున్న ప్రచారాన్ని మీ భుజాల మీద మోసుకుని మద్దతుగా నిలవడం సరికాదు" అని ఘాటు వ్యాఖ్యలు చేసింది తాప్సీ.

తాజాగా.. సోనాక్షి సిన్హా కూడా పాప్ స్టార్ రిహానాకు మద్దతుగా నిలిచింది. దేశంలో మానవహక్కుల ఉల్లంఘనపై, ఇంటర్నెట్‌ బంద్ చేయడంపై, విద్వేషాలు రగిల్చే ప్రసంగాలు, అధికార దుర్వినియోగంపై మాత్రమే అంతర్జాతీయ సెలబ్రిటీలు స్పందిస్తున్నారని సోనాక్షి సిన్హా తన ఇన్స్‌టాగ్రామ్‌లో పేర్కొంది. అదేవిధంగా.. ఈ సమస్య భారత అంతర్గత విషయం అంటూ చెప్పుకొచ్చిన సెలబ్రిటీలకు మరో సమాధానం ఇచ్చింది సోనాక్షి. రైతులకు మద్దతుగా ఉన్న అంతర్జాతీయ సెలబ్రిటీలు గ్రహాంతర వాసులు కాదని, వారు కూడా తోటి మానవులే అని గుర్తుచేసిన సోనాక్షి.. వారంతా మానవహక్కుల కోసం మాత్రమే పోరాటం చేస్తున్నారని చెప్పింది.

ఈ విధంగా రైతుల ఆందోళన ప్రపంచదేశాల దృష్టిని ఆక‌ర్షించింది. రైతులకు పలువురు అంతర్జాతీయ స్టార్లు మద్దతుగా నిలుస్తుండగా.. కొంద‌రు బాలీవుడ్ స్టార్లు ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు తెలిపారు. అయితే.. వీరిని వ్య‌తిరేకిస్తూ బాలీవుడ్ నుంచే మ‌రికొంద‌రు రైతుల ప‌క్షాన గ‌ళం వినిపిస్తున్నారు. ఈ ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంది? అన్న‌దానిపైనే అంద‌రి దృష్టి నెల‌కొంది.