Begin typing your search above and press return to search.

మహేష్‌ 27కి పరశురామ్‌ వండుతున్నది ఏంటీ?

By:  Tupaki Desk   |   20 April 2020 5:20 PM IST
మహేష్‌ 27కి పరశురామ్‌ వండుతున్నది ఏంటీ?
X
మహేష్‌ బాబు 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు తర్వాత 27వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే వంశీ పైడిపల్లి మూవీ కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్‌ అయ్యింది. ప్రస్తుతం మహేష్‌ బాబు పరశురామ్‌ దర్శకత్వంలో సినిమాకు ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

గీత గోవిందం చిత్రం తర్వాత దర్శకుడు పరశురామ్‌ తన తదుపరి చిత్రాన్ని మహేష్‌ బాబుతో చేయాలని భావించి ఒక దేశ భక్తి కథాంశంను రెడీ చేశాడు. అవినీతిపై పోరాడే ఒక సామాన్య భారతీయుడి కథతో మొదట చేయాలనుకున్నారు. అయితే వరుసగా అవే కాన్సెప్ట్‌ లు వద్దనుకున్న మహేష్‌ బాబు ఒక మెచ్యూర్డ్‌ లవ్‌ స్టోరీని రెడీ చేయమంటూ పరశురామ్‌ కు సూచించాడట. దాంతో ప్రస్తుతం పరశురామ్‌ ఆ తరహా స్క్రిప్ట్‌ ను సిద్దం చేసే పనిలో పడ్డట్లుగా సమాచారం అందుతోంది.

కాలేజ్‌ డేస్‌ ప్రేమ తరహా కాకుండా కాస్త మెచ్యూర్డ్‌ గా ప్రేమ.. పెళ్లి.. ఫ్యామిలీ నేపథ్యంలో మహేష్‌ బాబు కోసం పరశురామ్‌ స్టోరీ లైన్‌ ను సిద్దం చేశాడట. ప్రస్తుతం దాన్ని డెవలప్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మహేష్‌ బాబు ఇమేజ్‌ కు తగ్గట్లుగా ఉండటంతో పాటు ఈతరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఉండేలా దర్శకుడు పరశురామ్‌ కథను వండుతున్నట్లుగా సమాచారం అందుతోంది.