Begin typing your search above and press return to search.

2.0: తెలుగు రిలీజుకు తిప్పలు తప్పవా?

By:  Tupaki Desk   |   1 Nov 2018 11:02 AM GMT
2.0: తెలుగు రిలీజుకు తిప్పలు తప్పవా?
X
శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న '2.0' నవంబర్ ఆఖరున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే ఈ సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ విషయం లో నిర్మాతలైన లైకా ప్రొడక్షన్స్ వారికి ఇబ్బందులు తప్పేలా లేవని తాజాగా ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా తెలుగు వెర్షన్ రైట్స్ ను ఏషియన్ సునీల్ తీసుకున్నారు. ఈ డీల్ లో సునీల్ కు దగ్గుబాటి సురేష్ బాబు - రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు పార్టనర్లు గా ఉన్నారట. ఈ మేరకు ఎప్పుడో అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. భారీ మొత్తంలో లైకా వారికి అడ్వాన్సులు కూడా ఇచ్చారు. ఆ తర్వాత నెలలు గడుస్తున్నా సినిమా రిలీజ్ సంగతి తేలలేదు. దీంతో అడ్వాన్సు కొంత వెనక్కి తీసుకుని రిలీజ్ కు ముందు మళ్ళీ ఇస్తామని చెప్పారట. అలాగే లైకా వారు కొంత అడ్వాన్స్ వెనక్కి ఇవ్వడం జరిగింది. ఇంకా రూ. 13 కోట్లు మాత్రం లైకా వారిదగ్గరే ఉండిపోయింది. అగ్రిమెంట్ కూడా ఇప్పటికీ సునీల్ పేరిటే ఉంది.

ఇక ప్రస్తుతానికి వస్తే ఈ విషయం పరిష్కరించేందుకు సునీల్ మరో ప్రొడ్యూసర్ ఎన్వీ ప్రసాద్ సహకారం కోరాడట. లైకా వారితో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయట. కానీ ఇక్కడే మరో తిరకాసు వచ్చి పడింది. '2.0' తెలుగు వెర్షన్ రైట్స్ చేతికి వచ్చాయని ఆయనే ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితిలో ఎన్వీ ప్రసాద్ తో పని కాదని అర్థం అయిపోయింది. ఎన్వీ ప్రసాద్ తమ వైపు మాట్లాడతాడని అనుకుంటే ఇప్పుడు ఆ ఛాన్స్ లేకుండా పోయిందని సునీల్ కాస్త అప్సెట్ అయ్యాడట.

సునీల్ కు ఇప్పుడు లైకా వారు 13 కోట్ల అడ్వాన్సు తో పాటుగా వడ్డీ కూడా ఇవ్వాలి. కానీ వారు మాత్రం వడ్డీ మాఫీ చేసుకుని అసలు మాత్రం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ విషయం తెలిసిన ఏషియన్ సునీల్ - సురేష్ బాబు లు తమ డబ్బును వడ్డీతో సహా ఇవ్వకపోతే లైకా వారి సంగతి తేల్చేందుకు రెడీగా ఉన్నారట. అగ్రిమెంట్ ఎలాగు రద్దు చేయలేదు కాబట్టి సినిమా రిలీజ్ ఎలా చేస్తారో చూస్తామని అంటున్నారట. ఇదంతా చూస్తుంటే అడ్వాన్సు ఇష్యూలో లైకాకు తిప్పలు తప్పేలా లేవు.