Begin typing your search above and press return to search.

'శాకుంతలం'లో జాలరులుగా స్టార్ కమెడియన్స్!

By:  Tupaki Desk   |   19 March 2021 6:45 AM GMT
శాకుంతలంలో జాలరులుగా స్టార్ కమెడియన్స్!
X
గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' రూపొందుతోంది. 'దిల్' రాజుతో కలిసి గుణశేఖర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో 'శకుంతల' పాత్రను సమంత పోషిస్తుండగా, దుష్యంత మహారాజు పాత్ర కోసం మలయాళ నటుడు దేవ్ మోహన్ ను తీసుకున్నారు. ఇక ఈ సినిమాలో ఆశ్రమవాసంలోని శకుంతల స్నేహితురాళ్లుగా అనసూయ - ప్రియంవద కనిపిస్తారు. ఈ రెండు పాత్రలు కూడా చాలా కీలకమైనవే. అనసూయ పాత్రకి ఈషా రెబ్బాను తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక ప్రియంవద పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేసుకుంటారో చూడాలి.

దుష్యంతుడి మిత్రుడైన 'మాఢవ్యుడు' పాత్ర కూడా చాలా ముఖ్యమైనదే. మహారాజు కూడానే ఉంటూ నవ్వించే విదూషకుడి పాత్ర ఇది. ఈ పాత్రకుగాను సునీల్ ను గానీ, వెన్నెల కిషోర్ ను గాని తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మరో ఇద్దరు స్టార్ కమెడియన్స్ కి కూడా ఈ సినిమాలో చోటు దక్కనుంది. దుర్వాస మహర్షి శాపం కారణంగా శకుంతలను దుష్యంతుడు మరిచిపోతాడు. ఆ విషయం తెలియని శకుంతల ఆయన దగ్గరికి పడవలో బయల్దేరుతుంది. దుష్యంతుడు గాంధర్వ వివాహ సమయంలో తన వ్రేలికి తొడిగిన ఉంగరాన్ని ఆమె ఆ నదిలో పోగొట్టుకుంటుంది. ఫలితంగా ఆమె దుష్యంతుడి తిరస్కారానికి గురవుతుంది.

అయితే నదిలో శకుంతల జారవిడుచుకున్న ఉంగరాన్ని ఒక చేప మింగుతుంది. ఆ చేప ఒకే సమయంలో ఇద్దరు జాలరులకు దొరుకుతుంది. దాని కడుపులో నుంచి బయటపడిన ఉంగరం తనకి చెందుతుందంటే .. తనకి దక్కుతుందని వాళ్లిద్దరూ దెబ్బలాడుకుంటారు. ఈ కారణంగానే ఈ విషయం రాజుగారివరకూ వెళుతుంది. జాలరిగూడెం నేపథ్యంలో సాగే జాలరుల పాత్రలు రెండూ హాస్యభరితమైనవే. అందువలన ఈ రెండు పాత్రలు స్టార్ కమెడియన్స్ కి దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అద్భుతమైన దృశ్యకావ్యంగా రూపొందుతున్న ఈ పాన్ ఇండియా సినిమాలో, ఆ పాత్రలను అందుకునే అదృష్టవంతులు ఎవరో చూడాలి.