Begin typing your search above and press return to search.

ఆ సర్జరీనే బాలు పరిస్థితికి కారణమా?

By:  Tupaki Desk   |   22 Aug 2020 3:00 PM IST
ఆ సర్జరీనే బాలు పరిస్థితికి కారణమా?
X
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కరోనా బారిన పడుతున్నారు. వాళ్లలో 90 శాతానికి పైగా ఏ ఇబ్బందీ లేకుండా.. ఆసుపత్రికి కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండా కోలుకుంటున్నారు. మన దేశంలో కూడా పరిస్థితి అందుకు భిన్నంగా లేదు. మన చుట్టూ ఉన్న వాళ్లలో ఎంతోమంది కరోనా బారిన పడి.. ఇంట్లోనూ ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటూ దాన్నుంచి బయటపడుతున్నారు. చాలా కొద్ది మందికి మాత్రమే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాల్సిన అవసరం పడుతోంది. కొద్దిమందికి మాత్రం ప్రాణాల మీదికి వస్తోంది. ప్రాణాలూ పోతున్నాయి. శరీరంలో వేరే ఆరోగ్య సమస్యలు ఉండి.. కరోనా ప్రభావం వాటి మీద పడుతున్న వాళ్లు విషమ స్థితికి చేరుకుంటున్నారు. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు పెద్ద అనారోగ్య సమస్యలున్నట్లు, ఆయన ఆసుపత్రి పాలైనట్లు ఎప్పుడూ సమాచారం బయటికి రాలేదు. మరి కరోనా బారిన పడ్డ ఆయన ఎందుకు ఇప్పుడు విషమ స్థితిలో ఉన్నారన్నది చాలామందికి అర్థం కావడం లేదు.

బాలు సన్నిహితుల సమాచారం ప్రకారం గత ఏడాది బాలు చేసుకున్న బేరియాట్రిక్ సర్జరీ వల్లే ఇప్పుడు ఆయన పరిస్థితి విషమించిందట. వయసు పెరిగిపోతుండటంతో బరువు తగ్గని పక్షంలో కష్టమని భావించి ఆయన బేరియాట్రిక్ సర్జరీకి వెళ్లారు. దాని ఫలితంగానే ఆయన కాస్త సన్నబడ్డారు. దీని గురించి ఓ సందర్భంలో మాట్లాడుతూ.. తాను లావుగా ఉన్నపుడు ఎవరూ ఏమీ అడగలేదని.. బరువు తగ్గి ఆరోగ్యకరంగా మారితే మాత్రం ఏమైందంటూ అడుగుతున్నారని చమత్కరించారు బాలు ఆ సంగతలా ఉంచితే.. బేరియాట్రిక్ సర్జరీ కారణంగా బాలు ఒంట్లో కొన్ని అవయవాలు బలహీన పడి కొంచెం కాంప్లికేషన్స్ వచ్చాయని.. మామూలుగా అయితే అవేమంత ఇబ్బందికరం కాదని.. కానీ కరోనా ఆయన ఒంటి మీద తీవ్ర స్థాయిలో దాడి చేయడానికి అది కారణంగా మారిందని.. అందుకే ఆయన పరిస్థితి విషమించిందని అంటున్నారు. మరి ఈ స్థితి నుంచి బాలు ఎలా కోలుకుని బయటపడతారో చూడాలి.