Begin typing your search above and press return to search.

ఇది సార్.. సౌత్ ఇండియా బ్రాండూ..!

By:  Tupaki Desk   |   20 April 2022 12:04 PM GMT
ఇది సార్.. సౌత్ ఇండియా బ్రాండూ..!
X
ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సౌత్ సినిమా డామినేషన్ కొనసాగుతోంది. దక్షిణాది చిత్రాలు ఇప్పుడు జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఒకప్పుడు ఉత్తరాది ప్రేక్షకులు మన సినిమాలను పెద్దగా పట్టించుకునేవారు కాదు.. కానీ ఇప్పుడు సౌత్ సినిమాల కోసం ఆతృతగా వేచి చూసే పరిస్థితి వచ్చింది.

తెలుగు సినిమా అంటే రీజనల్ మూవీ అనే రోజులు పోయి.. తెలుగు చిత్రం అంటే పాన్ ఇండియా అనే రోజులు వచ్చాయి. బాలీవుడ్ మేకర్స్ సైతం ఇప్పుడు టాలీవుడ్ ను ఫాలో అవుతున్నారు. 'బాహుబలి' సినిమాతో ఎస్ఎస్ రాజమౌళి పాన్ ఇండియా దారి చూపించగా.. ఇప్పుడు దర్శక హీరోలందరూ అదే బాటలో పయనిస్తున్నారు. ప్రతీ ఒక్కరూ తమ కంటెంట్ తో అన్ని వర్గాల వారిని మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

'బాహుబలి' 1 & 2 సినిమాలతో రాజమౌళి - ప్రభాస్ కలిసి సంచలనం సృష్టించారు. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1810 కోట్లు రాబట్టిన ఈ సినిమా నార్త్ సర్క్యూట్స్ లో రూ. 510 కోట్లు సాధించింది. దీంతో ప్రభాస్ - జక్కన్న క్రేజ్ ఓ రేంజ్ లో పాకిపోయింది. గ్లోబల్ స్టార్ అండ్ డైరెక్టర్ గా ఎదిగారని అనొచ్చు. నిజానికి ఇప్పుడు అందరూ పాన్ ఇండియా అంటున్నారంటే వీరిద్దరు ఇచ్చిన ధైర్యమే అని చెప్పాలి.

గతేడాది చివర్లో వచ్చిన 'పుష్ప' సినిమా ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా హిందీ మార్కెట్ లో 100 కోట్లను కొల్లగొట్టింది. సుకుమార్ టేకింగ్ కు అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్ కు నార్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ క్రమంలో ఇప్పుడు బన్నీ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఇప్పుడు అందరూ 'పుష్ప' పార్ట్-2 కోసం వేచి చూస్తున్నారు.

ఇదే క్రమంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే రూ. 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. దీంతో ఇప్పుడు తారక్ - చరణ్ కూడా పాన్ ఇండియన్ స్టార్స్ అయిపోయారు. రాబోయే రోజుల్లో మరికొందరు టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా స్టార్స్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

'కేజీయఫ్' సినిమాతో శాండిల్ వుడ్ సైతం అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఇప్పుడు 'కేజీయఫ్: చాప్టర్ 2' చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఆరు రోజుల్లోనే 550 కోట్లు వసూలు చేసి బాలీవుడ్ ట్రేడ్ నిపుణులను ఆశ్చర్యపరిచింది. దీంతో యష్ - డైరెక్టర్ ప్రశాంత్ నీల్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో పాకింది. ఇప్పుడు మిగతా కన్నడ దర్శక హీరోలు నేషనల్ వైడ్ కాలర్ ఎగరేయాలని చూస్తున్నారు.

మలయాళ ఇండస్ట్రీ కూడా కంటెంట్ బేస్డ్ సినిమాలతో తన స్టామినా ఏంటో చూపిస్తోంది. కథనే నమ్ముకొని తీసుకొని సినిమాలు జాతీయ స్థాయిలో ఆదరణ దక్కించుకుంటున్నాయి. ఇటీవల కాలంలో 'కురూప్' 'భీష్మపర్వం' 'ఆరాట్టు' వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. 'లూసిఫర్' 'హెలెన్' 'నాయట్టు' 'డ్రైవింగ్ లైసెన్స్' 'అయ్యప్పనుమ్ కోషియుమ్' వంటి మలయాళీ సినిమాలు హిందీలో రిమేక్ చేయబడుతున్నాయంటేనే అక్కడి కంటెంట్ వాల్యూ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

కోలీవుడ్ లో రజినీకాంత్ - కమల్ హాసన్ వంటి హీరోలు.. శంకర్ వంటి దర్శకులు అప్పట్లోనే నార్త్ లో హవా చూపించారు. ఇప్పుడు విజయ్ - అజిత్ - ధనుష్ - సూర్య వంటి హీరోలు పాన్ ఇండియా స్థాయిలో రాణించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సరైన సినిమా పడితే నార్త్ లో బాలీవుడ్ కు చెమటలు పట్టించడం ఖాయం. మొత్తం మీద తెలుగు తమిళ కన్నడ మలయాళ ఇండస్ట్రీలు ఇప్పుడు బాలీవుడ్ పై ఆధిపత్యం చూపిస్తున్నారని స్పష్టంగా కనిపిస్తోంది.