Begin typing your search above and press return to search.

మణిరత్నం ఆశలపై నీళ్లు జల్లిన రజినీ కూతురు

By:  Tupaki Desk   |   4 Feb 2019 12:30 PM GMT
మణిరత్నం ఆశలపై నీళ్లు జల్లిన రజినీ కూతురు
X
తమిళ స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నం చాలా కాలంగా పొన్నియిన్‌ సెల్వన్‌ నవల ఆధారంగా ఒక చిత్రాన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ కథ భారీ బడ్జెట్‌ తో కూడుకున్నది అవ్వడంతో పాటు భారీ తారాగణం అవసరం. బాహుబలి రేంజ్‌ లో ఆ నవలను సినిమా రూపంలోకి తీసుకు రావాలని భావించాడు. అందుకోసం నిర్మాతలను వెదకడంతో పాటు, కొందరిని ఒప్పించినట్లుగా కూడా ప్రచారం జరిగింది. మూడు నాలుగు ఏళ్లుగా ఈ సినిమా గురించి ఆలోచిస్తున్న మణిరత్నం ఎట్టకేలకు ఒక క్లారిటీకి వచ్చాడని, త్వరలోనే సినిమాను ప్రారంభిస్తాడని కొన్ని వారాల క్రితం తమిళ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి.

విక్రమ్‌, విజయ్‌ సేతుపతి, దుల్కర్‌ సల్మాన్‌, ఐశ్వర్య రాయ్‌ ఇంకా పలువురు స్టార్స్‌ తో ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కించబోతున్నట్లుగా పుకార్లు షికార్లు చేశాయి. ఇటీవలే 'నవాబ్‌' చిత్రంతో వచ్చిన మణిరత్నం తదుపరి చిత్రం అదే అయ్యి ఉంటుందని అనుకుంటున్న సమయంలో రజినీకాంత్‌ కూతురు సౌందర్య షాకింగ్‌ నిర్ణయం తీసుకుని మణిరత్నం ఆశలపై నీళ్లు జల్లింది.

ఒక వైపు మణిరత్నం ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ లో ఉండగానే మరో వైపు సౌందర్య అదే నవల ఆధారంగా వెబ్‌ సిరీస్‌ ను తీసుకు రాబోతున్నట్లుగా ప్రకటించేసింది. ఎంఎక్స్‌ ప్లేయర్‌ ఒరిజినల్స్‌ తో కలిసి ఈ వెబ్‌ సిరీస్‌ ను భారీ ఎత్తున నిర్మించబోతున్నట్లుగా సౌందర్య ప్రకటించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లుగా ఆమె పేర్కొంది. అయితే ఆ నవల రైట్స్‌ ఎవరి వద్ద ఉన్నాయనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

సౌందర్య అధికారికంగా ప్రకటించింది కనుక ఆమె వద్దే రైట్స్‌ ఉండి ఉంటాయనే టాక్‌ వస్తుంది. గత కొన్ని రోజులుగా ఆ సినిమా తీయాలనే ఆశల పల్లకిలో మణిరత్నం ఉన్నాడు కాని, ఎప్పుడు కూడా ఆ సినిమా విషయమై అధికారిక ప్రకటన చేయలేదు. దాంతో మణిరత్నం వద్ద రైట్స్‌ లేకపోవచ్చు. సౌందర్య ప్రకటనతో మణిరత్నం స్పందన ఏంటో చూడాలి.